అంత గొప్ప పాట‌ను దేవి 8 ఏళ్ల‌కే…

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోయినా.. కొన్ని పాట‌లు, స‌న్నివేశాలు క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంటాయి. వ‌ర్షం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎం.ఎస్.రాజు నిర్మాణంలో ప్ర‌భాస్, త్రిష, ఛార్మీ క‌లిసి న‌టించిన పౌర్ణ‌మి అంచ‌నాలు అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయినా.. ఇందులోని పాట‌లు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా భ‌ర‌త వేద‌మున పాట అయితే ఇప్ప‌టికీ ఇళ్ల‌లో మార్మోగుతూ ఉంటుంది.

క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్లు ఈ పాటను విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల‌ను దాటి ఈ పాట దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్ అంత‌ర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపుకి నోచుకుంటుండ‌డం విశేషం. తాజాగా ఒక చైనా అమ్మాయి షాంఘైలో ఈ పాట‌ను పెర్ఫామ్ చేసింది. చైనా అమ్మాయి సంప్ర‌దాయ భార‌తీయ నృత్యం చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం అంటే.. మ‌న దేవి పాట‌ను పెర్ఫామ్ చేయ‌డం మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.

ఈ పాటకు సంబంధించి వీడియోను ఒక నెటిజ‌న్ ఎక్స్‌లో షేర్ చేయ‌గా.. ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ కేవ‌లం 8 ఏళ్ల వ‌య‌సులోనే ఈ పాట‌ను కంపోజ్ చేశాడ‌ని.. త‌ర్వాత చాలా ఏళ్ల‌కు ఈ పాట‌ను సినిమాలో ఉప‌యోగించుకున్నార‌ని, దేవి బాల మేధావి అన‌డానికి ఇది నిద‌ర్శ‌న‌మని ఆయన చెప్పారు.

దేవి టీనేజీలోనే దేవి సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ మరీ ఎనిమిదేళ్ల‌కే ఇంత గొప్ప పాట‌ను కంపోజ్ చేశాడంటే మాత్రం షాక‌వ్వాల్సిందే. అత‌ను చెన్నైలో మాండ‌లిన్ శ్రీనివాస్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొంది.. చిన్న‌త‌నం నుంచే సంగీతంలో ప్ర‌యోగాలు చేయ‌డం మొద‌లుపెట్టాడు. దేవి వ‌య‌సు ప్ర‌స్తుతం 47 ఏళ్లు కాగా.. ఇప్ప‌టికే అత‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా దాదాపు మూడు ద‌శాబ్దాల కెరీర్‌కు చేరువ అవుతుండ‌డం విశేషం.