పంజా కోసం చేసిన త్యాగం చాలా పెద్దది  

రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పంజా పెద్ద ఎత్తున రీ రిలీజవుతోంది. పదిహేను సంవత్సరాల క్రితం ఇది విడుదలైనప్పుడు కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది. విపరీతమైన అంచనాలు అందుకోలేక పవర్ స్టార్ ఫ్లాపుల లిస్టులో చేరింది. అయితే ఇందులో స్టయిలింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జై క్యారెక్టర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టీవీ, డిజిటల్, యూట్యూబ్ లో వచ్చాక ఇప్పటి జెన్ జీకి కూడా బాగా నచ్చింది. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నా ఈ స్థాయి స్పందన.

బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ, కొత్త రిలీజులు ఉన్నా పంజాకు గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో వేదికగా 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మాములు విషయం కాదు. హైదరాబాద్ లో చాలా షోలకు టికెట్ ముక్క లేదు. ఈ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ తన జ్ఞాపకాల గురించి ప్రత్యేకంగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పంజాకు సంబంధించిన ఒక ముఖ్యమైన మెమరీ గురించి విశేషంగా చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

పంజా టైంలోనే విష్ణువర్ధన్ కి అజిత్ బిల్లా 2 చేసే అవకాశం దక్కింది. మీడియాలో ప్రకటనలు కూడా వచ్చేశాయి. కానీ డేట్స్ సమస్య వల్ల ఏదో ఒకటే ఒప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో బాగా ఆలోచించిన విష్ణువర్ధన్ చివరికి పవన్ కోసం పంజాకే ఓటు వేశారు. దీనికి అజిత్ కూడా ప్రోత్సాహం అందించడంతో పని తేలికయ్యింది. ట్విస్ట్ ఏంటంటే బిల్లా 2 వేరే దర్శకుడితో తీస్తే ఫ్లాప్ చవి చూడగా కాకతాళీయంగా ఇటు పంజా కూడా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది.

తర్వాత విష్ణువర్ధన్ అజిత్ కాంబోలో ఆరంభం వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే పంజా కోసం ఈయన చేసిన త్యాగం చిన్నది కాదు. ఎందుకంటే బిల్లా అప్పటికే పెద్ద బ్లాక్ బస్టర్. దానికి సీక్వెల్ వదులుకోవడం అంటే ఒక కల్ట్ మూవీని చేజార్చుకున్నట్టే. నిజంగా బిల్లా 2 వేరే వాళ్ళు డీల్ చేయడం వల్ల దాని బ్రాండ్ విలువ తగ్గిపోయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ కు పంజా లాంటి మూవీ ఇచ్చిన సంతృప్తి విష్ణువర్ధన్ కు ఎప్పటికీ చెప్పుకునేలా శాశ్వతంగా ఉండిపోయింది.