అనవసరమైన డైవర్షన్లతో ‘టాక్సిక్’ రచ్చ

దశాబ్దాల చరిత్ర కలిగిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో డిజాస్టర్లు చూసింది. అన్ని భాషలకు ఇది వర్తిస్తుంది. టాక్సిక్ తో మొదలయ్యింది కాదు, ఇకపై ఆగేది కాదు. కానీ దీని విషయంలో జరుగుతున్న డైవర్షన్లు, అనవసర రచ్చ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. నిన్న యష్ తల్లి పుష్ప ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం అల్లు అరవింద్ గారన్న మాటని పట్టుకుని ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంగా అల్లు ఫ్యాన్స్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

ఇంకోవైపు టాక్సిక్ మీద సానుభూతి, మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకోండని పెడుతున్న ట్వీట్లు, వాటికి వ్యంగ్యంగా వస్తున్న సమాధానాలు  ఇలా ఆన్ లైన్ వేదికగా ఏవేవో డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. కొందరు శాండల్ వుడ్ నటీనటులు టాక్సిక్ ని ఆకాశానికి ఎత్తుతూ మెసేజులు పెట్టారు. మంచిదే. ఒకరిద్దరు అడుగు ముందుకేసి కన్నడ హీరోని టార్గెట్ చేస్తున్నారంటూ యష్ కి మద్దతుగా మాట్లాడేందుకు ప్రయత్నించడం కామెడీగా అనిపించింది. ఉత్తరాది ఆడియన్స్ ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంది.  

అసలు నిర్మాత సైలెంట్ అయ్యారు. సక్సెస్ మీట్ లాంటివి పెట్టే ఆలోచన చేయలేదు. దర్శకురాలు బయట కనిపించకుండా ఎక్స్, ఇన్స్ టాకు పరిమితమయ్యారు. ఇక యష్ సంగతి సరేసరి. మీడియాకు అందుబాటులోకి రాలేదు. దాదాపు క్యాస్టింగ్ మొత్తం తమ అఫీషియల్ హ్యాండిల్స్ లో టాక్సిక్ గురించి చెప్పడం మానేశారు. ఎవరి దాకో ఎందుకు మెయిన్ హీరోయిన్ కియారా అద్వానీ నుంచి ఆగస్ట్ 21 తర్వాత ఒక్క ట్వీట్ లేదు. అంటే ఫలితం ఆమెకు అర్థమైపోవడం వల్లే కదా.

వీళ్లంతా సైలెంట్ గా ఉంటే ట్విట్టర్ యువత మాత్రం అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటోంది. తెలుగు కన్నడ తమిళం ఎక్కడైనా ఇలాంటి డిజాస్టర్స్ గతంలో చాలా వచ్చాయి. ఇదే కన్నడ నుంచి వచ్చిన కబ్జా టైంలో సానుభూతిపరులంతా ఎక్కడికి వెళ్లారు. మార్టిన్ అంత దారుణంగా ఉన్నా ఎవరూ సమర్ధించలేదు. మరి టాక్సిక్ కు మాత్రమే స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలనేది అసంబంద్ధమైన స్టేట్ మెంట్. చూస్తుంటే ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. కొత్త మలుపులు తీసుకునేలా ఉంది.