ఇరుముడిని ఆకాశానికెత్తేసిన దిల్ రాజు

తమ సినిమాలకు పోటీగా వేరే సినిమాలు రిలీజైనపుడు.. సాధారణంగా నిర్మాతలు వాటి గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. అందులోనూ అవతలి సినిమాను ప్రొడ్యూస్ చేసింది తమతో సరైన సంబంధాలు లేని వాళ్లయితే స్పందన మరీ కష్టం. మాట్లాడినా మొక్కుబడిగానే ఉంటుంది తప్ప.. అవతలి చిత్రాన్ని పొగడ్డం అరుదు. కానీ దిల్ రాజు ఈ పనే చేసి ఆశ్చర్యపరిచారు. దిల్ రాజుకు కొన్నేళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే.

దిల్ రాజుకు పోటీగా డిస్ట్రిబ్యూషన్ హౌస్ పెట్టుకోవడమే కాక.. ఏపీ, తెలంగాణల్లో థియేటర్లను చేజిక్కించుుకనే పనిలో మైత్రి అధినేతలు ఉండడం ఇరు వర్గాల మధ్య వైరానికి కారణమైంది. ఈ ఇద్దరి సినిమాలు పోటీలో ఉంటే థియేటర్ల కోసం గొడవలు తప్పట్లేదు. ఇటీవల మైత్రి వారి ఇరుముడి ఇరగాడేస్తుండగా.. దాని స్క్రీన్లను దిల్ రాజు రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ కోసం లాగేయడం మీదా వివాదం నడిచింది. కానీ ‘టాక్సిక్’ అంచనాలను అందుకోలేక చతికిలపడగా.. తిరిగి ఇరుముడికే స్క్రీన్లు వెళ్లిపోయాయి.

ఇలాంటి టైంలో ‘ఇరుముడి’ సినిమాను దిల్ రాజు కొనియాడడం చర్చనీయాంశంగా మారింది. ‘కూర్మ అవతార్’ అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు.. ఈ సినిమాలో భాగమైన సాయికుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇరుముడి’ సినిమాను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఈ మధ్యే సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాలో గురుస్వామిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించారని దిల్ రాజు అన్నారు.

ఇరుముడి చూస్తుంటే.. ఒక మంచి సినిమా ఇచ్చే ఎనర్జీ ఎలా ఉంటుందో అర్థమవుతోందని.. ఆ చిత్రం దాని టీంకే కాకుండా ఇండస్ట్రీ మొత్తానికి జోష్ ఇచ్చిందని.. పరిశ్రమ మొత్తం ‘ఇరుముడి’ విజయాన్ని సెలబ్రేట్ చేస్తోందని రాజు అన్నారు. ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తుంటే.. సినిమాలు తీసే తమ లాంటి వాళ్లకు ఒక ధైర్యం వస్తుందని.. ఇరుముడి అలాగే తమకందరికీ గొప్ప ఎనర్జీ ఇచ్చిందని రాజు కొనియాడారు. తాను రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ను ‘ఇరుముడి’ గట్టి దెబ్బ కొట్టినప్పటికీ.. అదేమీ పట్టించుకోకుండా రాజు ఆ చిత్రాన్ని కొనియాడడం గొప్ప విషయమే.