గ‌ణేష్ వేడుక‌…`చిరు` చెప్పిన‌ట్టు చేద్దామా!

సామాజిక కార్య‌క్ర‌మాల విష‌యంలో చురుగ్గా ఉండే మెగా స్టార్ చిరంజీవి.. త‌ర‌చుగా ర‌క్త‌దానం, మొక్క‌ల పెంప‌కం, ప‌ర్యావ‌ర‌ణం గురించి ప్ర‌జ‌ల‌కు, ఆయ‌న అభిమానుల‌కు కూడా సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో 15 రోజుల్లో రానున్న గ‌ణేష్ వేడుక‌.. వినాయ‌క‌చ‌వితికి సంబంధించి కూడా కొన్ని సూచ‌న‌లు చేశారు. ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌నే కాదు.. మ‌రో కీల‌క సూచ‌న కూడా చేశారు. మ‌రి ఆయ‌న సూచ‌న‌లు పాటిద్దామా?.

చిరు ఏమ‌న్నారంటే..

బీఆర్ ఎస్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సంతోష్ నేతృత్వంలో రెండేళ్ల కింద‌టి నుంచి `గ్రీన్ ఇండియా చాలెంజ్‌` పేరుతో ప‌ర్యావ‌ర‌ణ హిత ఉద్య‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో కోటి మొక్క‌లు నాటేందుకు ఆయ‌న తొలి ఉద్య‌మం చేప‌ట్టారు. త‌ర్వాత‌.. మురుగు నీరు పారుద‌ల‌కు సంబంధించి ఉద్య‌మాన్ని చేప‌ట్టారు. అనంత‌రం.. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించే ఉద్య‌మానికి కూడా శ్రీకారం చుట్టారు.

తాజాగా `సీడ్ గ‌ణ‌ప‌తి` ఉద్య‌మానికి మాజీ ఎంపీ సంతోష్ తెర‌దీశారు. సీడ్ గ‌ణ‌ప‌తి అంటే.. వివిధ ర‌కాల పుష్పించే మొక్క‌ల‌కు చెందిన విత్త‌నాల‌ను బంక‌మ‌ట్టిలో క‌లిపి.. వాటితో వినాయ‌క విగ్ర‌హాల‌ను రూపొం దించ‌డం. వీటిని ఇంట్లోనే రూపొందించుకునే అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా `సీడ్‌` అనే ప‌దానికి మ‌రో అర్ధం కూడా ఉంది.. `చిన్న‌` అని!. అంటే.. భారీ భారీ విగ్ర‌హాలు కాకుండా.. చిన్న‌పాటి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను రూపొందించాల‌న్న‌ది దాన‌ర్థం.

సోమ‌వారం ఉద‌యం చిరు నివాసానికి వెళ్లిన మాజీ ఎంపీ సంతోష్‌.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మం లో భాగంగా తాము రూపొందించిన సీడ్ గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని చిరుకు బ‌హూక‌రించారు. ఆ విగ్ర‌హం విశిష్ట‌త లను కూడా ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. సీడ్ వినాయ‌కుడిని ఇంట్లోనే రూపొందించుకుని పూజించాల‌ని.. త‌ద్వారా.. ప‌ర్యావ‌ర‌ణానికి మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు. విగ్ర‌హం నిమజ్జ‌నం త‌ర్వాత‌.. దానిలోని విత్త‌నాలు మొక్క‌లుగా మారి.. మ‌న‌కు పూలు, పండ్లు కూడా ఇస్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. మ‌రి ఈ సూచ‌న‌ను అనుస‌రిద్దామా?!?