రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే పలు వాయిదాలు, డైరెక్టర్ల మార్పుతో బాగా లేట్ అయిన ఈ ప్రాజెక్టుని వచ్చే సంక్రాంతి బరిలో దింపాలనే సంకల్పంతో నిర్మాత కమల్ హాసన్ తన టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ అయిపోగా రజని బ్రేక్స్ ఇవ్వకుండా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఒక అప్డేట్ టాలీవుడ్ జనాలకు షాక్ కలిగించేలా ఉంది.

చెన్నై సమాచారం మేరకు ధర్మన్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక ముఖ్యమైన పాత్రకు రాపో రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే అయినట్టు వినికిడి. రజని కూతురిగా నటిస్తున్న శ్రీలీలకు జోడిగా రామ్ ఉంటాడని, చాలా పవర్ ఫుల్ ఎపిసోడ్స్ రజనితో పాటు ఉంటాయని అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంత పెద్ద కోలీవుడ్ స్టార్ తో నటించడం రామ్ కు ఒక ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోతుంది కానీ ఒక రిస్క్ ఉంది.

రజనీకాంత్ కూలిలో నాగార్జున ప్రతినాయకుడిగా చేయడం ఆయనకు పెద్ద మేలు కలిగించలేదు. కారణం ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు. విక్రమ్ రోలెక్స్ రేంజ్ లో పేలుతుందనుకుంటే అతి మాములుగా వచ్చింది. దానికి తోడు కూలి ఫ్లాప్ కావడం నాగ్ కు ఉపయోగపడలేదు. అంతకు ముందు అజిత్ వలిమైలో టాలీవుడ్ యూత్ హీరో కార్తికేయ విలన్ గా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ దక్కలేదు. మరి రామ్ ఇవన్నీ ఆలోచించే ఒప్పుకన్నాడంటే ఏదో పవర్ ఫుల్ టచ్ ఉంటుంది.

ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ కన్ఫర్మేషన్ కోసమైతే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. స్వీయ దర్శకత్వంలో తన ఇరవై మూడో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ ఒకవేళ నిజంగా ధర్మన్ చేసే పనైతే డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి. సెతస్కోప్ పట్టుకునే డాక్టర్ కత్తులు పట్టుకుని ఎందుకు రక్తపాతం సృష్టించాల్సి వచ్చిందనే పాయింట్ మీద ధర్మన్ రూపొందుతోంది. యాక్షన్,. వయొలెన్స్ ఈసారి పుష్కలంగా ఉంటాయట. దీనికన్నా ముందు జైలర్ 2 అక్టోబర్ రెండో వారంలో రిలీజ్ కానుంది.