భీష్మ దర్శకుడు కనిపించడం లేదేంటి

ఎనిమిది సంవత్సరాల క్రితం ఛలోతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నని పరిచయం చేయడం ద్వారా టాలీవుడ్ కి ఎంత ఫేవర్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో నాగ శౌర్య ఛలో తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందుకోలేకపోవడం చూస్తే ఇదెంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నితిన్ తో చేసిన భీష్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టి మంచి లాభాలు తీసుకొచ్చింది.

ఇదంతా 2020 నాటి ముచ్చట. ఈ టైంలోనే వెంకీ కుడుముల ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ కథ వల్లనో ఇంకేదైనా కారణం వల్లనో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఓ రెండేళ్లు వేస్ట్ అయ్యాక వెంకీ కుడుముల తిరిగి నితిన్ తో జట్టుకట్టి రాబిన్ హుడ్ తీశారు. మైత్రి మూవీ మేకర్స్ కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. 2024 డిసెంబర్ లో రావాల్సిన ఈ మూవీ వాయిదాలు వేసుకుని గత ఏడాది మార్చిలో రిలీజై డిజాస్టర్ అందుకుంది.

తర్వాత ఏడాదిన్నర గడిచిపోయినా వెంకీ కుడుముల నుంచి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. ఎవరితో చేయబోతున్నారనే సమాచారం కూడా లేదు. ఇట్లు అర్జున అనే మూవీకి నిర్మాతగా వ్యవహరించడం తప్ప ఆయన చేతిలో సాలిడ్ గా హీరో లేరని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని, అంతా అయిపోయాక సిద్దు జొన్నలగడ్డ లేదా శ్రీవిష్ణు లాంటి టైమింగ్ ఉన్న హీరోతో చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది.

ప్యాన్ ఇండియా మూవీస్ కోసం ఏళ్లకేళ్లు త్యాగంలో చేయడం ఓకే. కానీ మీడియం బడ్జెట్ సినిమాలు తీసే వెంకీ కుడుముల లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్లు సైతం ఒక్కోదానికి రెండు మూడు సంవత్సరాలు తీసుకోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఛలో, భీష్మ లాంటి ఫన్ సబ్జెక్టులు రాసుకుంటే అనిల్ రావిపూడి లాగా మంచి కెరీర్ సెట్ చేసుకోవచ్చు. కేవలం ఒక ఫ్లాప్ కే ఇంత వెనుకడుగు వేయడం సబబు కాదు. మరి వెంకీ కుడుముల మనసులో ఏ కాంబినేషన్ ఉందో.