పెనిమిటి కోసం తగ్గేదెలే అంటున్న రష్మిక

అన్ని అనుకున్న టైంకి జరిగి ఉంటే విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయ్యేది. అయితే ఇంకా పనులు పెండింగ్ లో ఉండిపోవడంతో వాయిదా వేసుకున్నారు. దాని స్థానంలో ఆనంద్ దేవరకొండ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రణబాలి కొత్త విడుదల తేదీ ఎప్పుడని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. దానికి సమాధానం దొరికేలా ఉంది. అక్టోబర్ 30 వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అధికారికంగా ఏదో ఒక టైంలో ప్రకటించబోతున్నారు. హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ఇటీవలే మైసా షూటింగ్ లో డాన్స్ చేస్తూ తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. డాక్టర్లు ఆరు వారాల దాకా విశ్రాంతిని రికమండ్ చేశారు. రణబాలిలో తన భాగం చాలా వరకు పూర్తయ్యిందట. బాలన్సులు ఏదైనా ఉంటే తను పూర్తిగా కోలుకున్నాక ఫినిష్ చేసే అవకాశముంది. భర్త కం హీరో విజయ్ దేవరకొండ ఏ చిన్న రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఇన్ సైడ్ టాక్. అయినా సరే ఎక్కువ ఆలస్యం కాకుండా గాయంతోనే వీలైనంత త్వరగా జాయినయ్యేందుకు రష్మిక సంసిద్ధంగా ఉందని సమాచారం.

ఒకవేళ ఇదే డేట్ లాక్ చేసుకుంటే మంచిదే. ఎందుకంటే అక్టోబర్ మొదటి రెండు మూడు వారాల్లో కీలకమైన సినిమాలున్నాయి. వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకే 47, రజనీకాంత్ జైలర్ 2, ధనుష్ ఓం లాంటివి ప్యాన్ ఇండియా రేంజ్ లో క్యూ కట్టాయి. దసరాకు చిరంజీవి విశ్వంభర వస్తుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. అక్టోబర్ 16 అనుకుంటున్నారట. వీటి మధ్య క్లాష్ కావడం కంటే రణబాలి సోలోగా రావడమే బడ్జెట్ పరంగా సేఫ్ అవుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రణబాలికి శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్రం రాక ముందు జరిగిన పోరాటంలో ఒక వీరుడు చేసిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తారట. రెగ్యులర్ ఫ్రీడమ్ ఫైట్ తరహాలో కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని ఇందులో ఆవిష్కరిస్తారని వినికిడి. పెళ్లి చేసుకున్నాక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఇది. అందుకే ఫ్యాన్స్ కి స్పెషల్ గా నిలవనుంది.