తెలంగాణ సంస్కృతి గురించి భ‌లే చెప్పిన న‌రేష్‌

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్ప‌టికీ, అంద‌రం తెలుగు వాళ్ల‌మే అనుకుంటూ మెజారిటీ జ‌నం సామ‌ర‌స్యంగా సాగిపోతుంటే.. కొంద‌రు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం వివాదాలు రాజేయ‌డం, సోష‌ల్ మీడియాలో కూడా కొంత‌మంది అదే ప‌నిగా గొడ‌వ ప‌డ‌డం మామూలైపోయింది. ఒక‌రి సంస్కృతిని ఒక‌రు కించ‌ప‌ర‌చ‌డం, గొడ‌వ‌లు ప‌డ‌డం ఇటీవ‌ల మ‌రింత పెరిగింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బేసిగ్గా ఆంధ్ర వాసి అయిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌.. ఆయా ప్రాంతాల భాష‌, యాస‌, సంస్కృతిని అంద‌రం గౌరవించాల‌ని చెబుతూ.. తెలంగాణ ప్రాంతంలో సంస్కృతి సంప్ర‌దాయాల గురించి గొప్ప మాట‌లు చెప్పారు. తాను న‌టించిన కొత్త చిత్రం క్రేజీ క‌ళ్యాణం ప్రెస్ మీట్లో ఆయ‌న చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌లు చెబుతూ భ‌లే స్పీచ్ ఇచ్చారు.

తెలంగాణ అన‌గానే తాగుడు, ఆంధ్ర అన‌గానే తిండి అని కొంద‌రు కామెంట్లు చేస్తుంటార‌ని, అది త‌ప్ప‌ని న‌రేష్ అన్నారు. ప్ర‌తి పాంత్రానికీ ఒక భాష‌, యాస‌, క‌ల్చ‌ర్ ఉంటాయ‌ని.. వాటిని గౌర‌వించాల‌ని ఆయ‌న‌న్నారు. ఇటీవ‌ల ఇడుపు కాయితం అనే సినిమా టైటిల్ గురించి నెగెటివ్ కామెంట్లు చేసిన‌పుడు తాను చాలా బాధ ప‌డ్డాన‌ని తెలిపారు. తాను బీజేపీలో ప‌ని చేస్తూ తెలంగాణ అంత‌టా తిరిగిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. 20 ఏళ్ల ముందు అప్పుడే హైద‌రాబాద్‌కు వ‌చ్చిన తాను ఈ ప్రాంతంలో ఒక చావు ఇంటికి వెళ్లిన‌ప్పుడు ఎదురైన అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు. 

చావు ఇంట్లో ప‌క్క‌నే మూడో రోజు అంద‌రూ క‌లిసి మ‌ద్యం తాగ‌డం చూశాన‌ని, త‌న‌కు కూడా ఆఫ‌ర్ చేస్తే ఇలాంటి టైంలో తాను తాగ‌న‌ని చెప్పానని, అస‌లీ క‌ల్చ‌ర్ ఏంటి అని కూడా అడిగాన‌ని రేష్ తెలిపారు. ఐతే ఇది చ‌నిపోయిన వ్య‌క్తి కోసం జ‌రిగే రివ్యూ మీటింగ్ లాంటిద‌ని.. అక్క‌డ అంద‌రూ మ‌ర‌ణించిన వ్య‌క్తి గురించే మాట్లాడ‌తార‌ని, శ‌త్రువులు కూడా త‌న గురించి అప్పుడు మంచి మాట‌లే చెబుతార‌ని అంటూ ఆ సంప్ర‌దాయం తాలూకు గొప్ప‌ద‌నాన్ని చెప్పార‌ని న‌రేష్ వెల్ల‌డించారు.

తెలంగాణ‌లోనే త‌ర్వాత ఇంకో చావుకు వెళ్తే.. ఒక వ్య‌క్తి చితి చుట్టూ డ్యాన్స్ చేయ‌డ‌మే కాక‌, చితి మీద ప‌డుకున్నాడ‌ని.. ఇదేంటని అడిగితే, చివ‌రి వ‌ర‌కు స్నేహితుడు తోడుంటాడ‌ని చెప్ప‌డానికి ఇలా చేసిన‌ట్లు చెప్పార‌న్నారు. ఇలా ప్ర‌తి ప్రాంతంలోనూ సంస్కృతి, సంప్ర‌దాయాల వెనుక ఎంతో నేప‌థ్యం ఉంటుంద‌ని, కాబ‌ట్టి అన్నింటినీ మ‌నం గౌర‌వించాల‌ని న‌రేష్ సూచించారు.