‘క్రాక్’ సినిమాకు ఎందుకు ఆగింది?


కొత్త ఏడాదిలో ఎన్నో ఆశలతో ‘క్రాక్’ సినిమా విడుదలకు సిద్దమైతే.. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శనివారం ఉదయం ఈ చిత్రానికి మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయిపోయాయి. మ్యాట్నీలైనా పడతాయో లేదో అని సందేహంగా ఉంది. ఫైనాన్స్ సమస్యలున్న సినిమాలకు ఇలా రిలీజ్ రోజు బ్రేక్ పడటం మామూలే. సరిగ్గా విడుదల ముంగిట ఫైనాన్షియర్లు నిర్మాతలకు మెలిక పెడుతుంటారు. అప్పుడు తప్ప వేరే ఏ సమయంలోనూ తమ డిమాండ్లను సాధించుకునేందుకు అవకాశముండదు.

‘క్రాక్’ చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు.. ఓ తమిళ డబ్బింగ్ సినిమాకు సంబంధించిన పేమెంట్లను క్లియర్ చేయకపోవడమే ‘క్రాక్’కు శాపంగా మారినట్లు తెలుస్తోంది. ఆ సినిమా పేరు.. ఆయోగ్య. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’కు ఇది రీమేక్. తమిళంలో విశాల్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా దాదాపు పది కోట్లకు ఠాగూర్ మధు అగ్రిమెంట్ మీద సంతకం చేశాడట.

ఐతే డబ్బులు చెల్లించాల్సిన వ్యక్తి చేతులెత్తేయగా.. మధ్యలో మధు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ‘అయోగ్య’ను తెలుగులో రిలీజ్ చేసి సమస్యల నుంచి బయట పడదామని అనుకున్నారట కానీ.. ఆ సినిమా రాంగ్ టైమింగ్‌లో రిలీజైంది. ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది. ‘అయోగ్య’ వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. సినిమా ద్వారా ఏమాత్రం రికవరీ కాకపోవడంతో మధు నష్టాన్ని మీద వేసుకోవాల్సి వచ్చింది.

ఐతే ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఇష్యూ సెటిల్ కాకపోగా.. సరిగ్గా మధు కొత్త చిత్రం ‘క్రాక్’ విడుదలవుతున్న టైం చూసి చెన్నైకి చెందిన వ్యక్తులు ఆయన్ని ఇరుకున పెట్టారు. ఇప్పటికిప్పుడు రూ.10 కోట్లు సెటిల్ చేస్తే తప్ప సినిమా రిలీజయ్యేలా లేదు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు అత్యవసరంగా సెటిల్ చేయడమంటే చిన్న విషయం కాదు. ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో వివాదానికి తెరదించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ మధ్యాహ్నానికి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మ్యాట్నీలు పడలేదు. సాయంత్రానికైనా సమస్య పరిష్కారమై షోలు పడతాయేమో చూడాలి. ఈ రోజు సినిమా రిలీజ్ కాకుంటే ఇటు నిర్మాత, అటు డిస్ట్రిబ్యూటర్లకు అది గట్టి దెబ్బ అనడంలో సందేహం లేదు.