యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ సినిమా తర్వాత అతడితో సినిమా చేయడానికి బోలెడంత మంది నిర్మాతలు ముందుకొచ్చారు. చాలామంది అడ్వాన్సులు కూడా ఇచ్చారు. పెద్ద స్టార్లకు కూడా తనతో సినిమా చేయాలన్న ఆసక్తి కలిగింది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పరశురామ్ రాత మారిపోయింది. ఇక ‘గీత గోవిందం’ హీరో విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ సంగతి చెప్పాల్సిన పని లేదు.
గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్లలో ఇది ఒకటిగా నిలిచింది. దెబ్బకు పరశురామ్ పరిస్థితి ఘోరంగగా తయారైంది. ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజై రెండేళ్లు దాటినా పరశురామ్ కొత్త సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. ఈ రెండేళ్లుగా పరశురామ్ పరిస్థితి ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా తయారైంది. ఒకప్పుడు పెద్ద స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. కానీ ఇప్పుడు అతడికి మిడ్ రేంజ్ స్టార్లు దొరకడం కూడా కష్టమవుతోంది.
ఈ మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్తో పరశురామ్ సినిమా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడి నడిచింది. కెరీర్లో ఈ దశలో హృతిక్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్తో పరశురామ్ సినిమా ఏంటి అని అందరూ షాకయ్యారు. కానీ ఈ వార్తలో నిజం లేదని తేలిపోయింది. పరశురామ్ కొత్త సినిమా గురించి ఇప్పుడు వేరే వార్త బయటికి వచ్చింది.
నందమూరి కళ్యాణ్ రామ్తో పరశురామ్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్తో కలిసి సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్.. ఇటీవలే పరశురామ్ చెప్పిన కథ పట్ల ఆసక్తి చూపిస్తున్నాడట. అంతా కుదిరితే ఈ కలయికలో సినిమా ఉండొచ్చని అంటున్నారు. అంటే హృతిక్తో పరశురామ్ సినిమా అని వచ్చిన వార్త జస్ట్ రూమరే అని అర్థమైపోయింది. కనీసం కళ్యాణ్ రామ్తో అయినా పరశురామ్ సినిమా ఉంటుందా అన్నదే చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
