తెలుగులో బజ్ కోసం పోరాడుతున్న జన నాయకుడుకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించడం ద్వారా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది. ఎలాగూ భగవంత్ కేసరి రీమేకనే విషయం అందరికి తెలిసిపోయింది కాబట్టి వీలైనంత వరకు చాలా మార్పులు చేశామనే సందేశం టాలీవుడ్ ఆడియన్స్ కి చెప్పడం కోసం నిర్మాతతో కలిసి ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం తెలివైన ఆలోచనే. అయితే ఇది ఎంతవరకు ఫలితం ఇస్తుందని ఆలోచిస్తే ఉపయోగాలు, నష్టాలు రెండూ కనిపిస్తున్నాయి.
బాలయ్య భగవంత్ కేసరిని జనాలు సూపర్ హిట్ చేసి పెట్టారు. ఓటిటిలో వచ్చాక భారీ ఎత్తున వ్యూస్ వచ్చాయి. తమిళ డబ్బింగ్ కూడా అందుబాటులో పెట్టడంతో వాళ్ళు కూడా బాగానే చూశారు. హిందీలోనూ రెస్పాన్స్ వచ్చింది. ఇంత జరిగిన తర్వాత జన నాయకుడు మళ్ళీ ఆ భాషల్లో అనువాదం చేయడం విచిత్రమే. అందుకే బుకింగ్స్ ఆశించినంత వేగంగా లేవనేది వాస్తవం. తమిళనాడులో బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే మన దగ్గర షోలు నిండటానికి యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది.
సరే ఎలాగూ తన కథే కాబట్టి అనిల్ రావిపూడి వీలైనంత పాజిటివ్ విషయాలు చాలా పంచుకున్నారు. గోట్ షూటింగ్ లో విజయ్ ని కలుసుకోవడం, మహేష్ బాబుకి ఫోన్ చేసి ఇదంతా చెప్పడం, కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తన స్టోరీ నుంచి తీసుకున్నారని వివరించడం ఇలా బోలెడు సంభాషణ ఉంది. అయితే కేవలం దీని ఆధారంగా జనాలు పొలోమని టికెట్లు కొనరు. టాక్ వచ్చాక అప్పుడు డిసైడ్ చేద్దాంలెమ్మని అనుకునేవాళ్లు ఎక్కువగా ఉంటారు.
తమిళనాడు సిఎం కావడంతో విజయ్ కనీసం ఒక ఈవెంట్ లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రజలు సమస్యల్లో ఉంటే ఇలా సినిమా ప్రమోషన్లు చేయడం ఏమిటని ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తాయని భావించి కనీసం చెన్నైలో వేడుక చేయడానికి కూడా ఇష్టపడలేదు. హీరోయిన్ పూజా హెగ్డే సైతం తన ప్రాధాన్యం తక్కువగా ఉండటంతో పబ్లిసిటీకి దూరంగా ఉంది. ఇక అనిరుధ్ రవిచందర్ సంగతి తెలిసిందే. మన దగ్గరేమో కానీ కోలీవుడ్ లో మాత్రం రికార్డులు ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
