గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఓ పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. డ్యాన్సర్స్ అసోసియేషన్లో రెండు వర్గాలు తయారై తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, ఆమె భర్త జానీ మాస్టర్ ఒకవైపుంటే.. శేఖర్ సహా మిగతా మాస్టర్లంతా ఒక వైపు నిలిచినట్లు కనిపిస్తోంది.
అసోసియేషన్ ఉప ఎన్నికల విషయమై ఈ రెండు వర్గాల తీవ్ర ఘర్షణకు దిగడం.. అంతలో మెగాస్టార్ చిరంజీవి వద్దకు ఈ విషయం చేరి జానీ, శేఖర్లను పిలిచి మాట్లాడడంతో వ్యవహారం అంతటితో సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు.
కానీ ఆ తర్వాత కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గొడవ మరింత పెద్దదవుతుందేమో అనిపించింది. ఐతే మరో ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ను రంగంలోకి దించి ఈ గొడవకు వెంటనే ముగింపు పలకాలని బాలయ్య స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.
జానీ మాస్టర్ తన భార్య సుమలతతో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చి.. ఈ సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించారు. చిరంజీవి తర్వాత బాలయ్య కూడా ముందుకు వచ్చి ఈ వ్యవహారం సద్దుమణిగేలా చేశారని, ఆయనకు థ్యాంక్స్ అని జానీ చెప్పారు. మరోవైపు ప్రసన్న కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు.
ఈ వివాదం విషయంలో బాలయ్య సీరియస్ అని విషయాన్ని ఆయన వెల్లడించారు. సినిమాల ద్వారా మనం జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలే తప్ప.. ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవకూడదని బాలయ్య స్పష్టం చేశారని.. దీంతో ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని ప్రసన్న కుమార్ తెలిపాడు. మరి ఇంతటితో అయినా విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగుతాయేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates