ప్రభాస్ చేయనంటే ఆ సినిమానే లేదట

ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో. వేరే భాషలకు చెందిన హాట్ షాట్ డైరెక్టర్లు అతడి కోసం కథలు రాస్తున్నారు. పేరున్న నిర్మాణ సంస్థలు అతడితో సినిమా చేయడానికి తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించి ఓం రౌత్.. ప్రభాస్ ప్రధాన పాత్రలో ‘ఆదిపురుష్’ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.

భూషణ్ కుమార్, ఓం రౌత్ సహా కొందరు బాలీవుడ్ ప్రముఖులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రభాస్‌తో పని చేయబోతున్న ఎగ్జైట్మెంట్‌ను ఓం రౌత్ ఎక్కడా దాచుకోవట్లేదు. అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, అతడి బాక్సాఫీస్ స్టామినా గురించి తెగ పొగిడేస్తున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్’ కథ, అందులో లీడ్ రోల్ గురించి అనుకోగానే తనకు ప్రభాస్ తప్ప మరో హీరో గుర్తుకు రాలేదని చెప్పాడు. కేవలం ప్రభాస్ కోసమే ఈ సినిమా పుట్టిందని.. ఒకవేళ అతను ఈ సినిమా చేయను అని ఉంటే ఈ ప్రాజెక్టే ఉండేది కాదని ఓం రౌత్ చెప్పాడు. తాను అనుకున్న పాత్రకు ప్రభాస్ మినహా ఏ నటుడూ న్యాయం చేయలేడని.. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ మేనియాను చూస్తారని ఓం రౌత్ అన్నాడు.

‘బాహుబలి’కి దీటుగా ‘ఆదిపురుష్’ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇంకొన్ని రోజుల్లోనే అది పూర్తవుతుంది. ఈ నెలాఖర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో ‘సలార్’ను ప్రభాస్ పట్టాలెక్కించనున్నాడు. అది పూర్తి కాగానే ‘ఆదిపురుష్’లో నటిస్తాడు. ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.