క్రేజీ దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్ ?

క్రేజీ దర్శకుడంటే ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు. న్యాచురల్ స్టార్ నాని బహుశా ఇదే ఆలోచనలో ఉండొచ్చు. ప్రస్తుతం ది ప్యారడైజ్ పూర్తి చేసే పనిలో ఉన్న నానికి దాని వల్ల జరిగిన ఆలస్యం చాలా సమయాన్ని తినేసింది. కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ విడుదల తేదీ ఇప్పటికీ తేలలేదు. సెప్టెంబర్ 25 ప్రచారంలోకి వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంకొంత టైం పట్టేలా ఉంది.

ఇదిలా ఉండగా దర్శకుడు సుజిత్ తో ప్లాన్ చేసుకున్న బ్లడీ రోమియో అనౌన్స్ మెంట్ తర్వాత మళ్ళీ ఆ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఈలోగా ఓజి 2 ప్రచారం ఊపందుకోవడం, పవన్ కళ్యాణ్ స్వయంగా ట్వీట్లు ఫోటోలు పెట్టడం చూస్తే రోమియోని పెండింగ్ లో పెట్టారేమోననే అనుమానం కలుగుతోంది. దీని సంగతలా ఉంచితే ఇటీవలే అర్జున్ తో బ్లాస్ట్ జోన్ రూపంలో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుభాష్ కె రాజ్ నాని కోసం ట్రై చేస్తున్నట్టు చెన్నై టాక్. ఇటీవలే కలిశాడట.

తక్కువ బడ్జెట్, లిమిటెడ్ లొకేషన్లలో తీసినా గ్రిప్పింగ్ నేరేషన్ వల్ల బ్లాస్ట్ జోన్ విజయం సాధించింది. థియేటర్ల నుంచి డెబ్భై అయిదు కోట్లకు పైగా వసూలు చేయడం గురించి కోలీవుడ్ ట్రేడ్ గొప్పగా మాట్లాడుకుంది. సుభాష్ రాజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరోలు లేకపోలేదు. అయితే నాని నిజంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా, కథా చర్చలు ఏ స్థాయి వరకు జరిగాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాంబో కుదిరితే మాత్రం మంచి యాక్షన్ కంటెంట్ ఈ కలయికలో చూడొచ్చు.

ఎప్పుడూ లేనిది నానికి సినిమా సినిమా మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తోంది. ఏడాదికి మూడు చిత్రాలు రిలీజ్ చేసే స్టేజి నుంచి సంవత్సరం దాటినా ఒక్క రిలీజ్ ఇవ్వలేకపోవడం వరకు ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. మునుపటి వేగం కావాలని కోరుకుంటున్నారు. అయితే ప్యాన్ ఇండియా వేటలో పడ్డాక స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నాని విషయంలో అదే జరుగుతోంది. ఈసారి ది ప్యారడైజ్ తో ఇతర భాషల మార్కెట్లోనూ జెండా పాతగలమనే నమ్మకంతో నానితో పాటు శ్రీకాంత్ ఓదెలలోనూ ఉంది.