వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు వారాల క్రితం వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా ఛాయలు కొన్ని ఇందులో ఉండటం వల్ల కొంత భాగం రీ షూట్ జరుగుతోందని, కథలోనూ కొన్ని మార్పులు చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ ఏకంగా వెంకీ అనిల్ 5 తర్వాత వస్తుందనే కొత్త గాసిప్ కు శ్రీకారం చుట్టారు.
అయితే అలాంటివేవీ లేవట. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఆదర్శ కుటుంబం ఏకే 47 సెప్టెంబర్ కల్లా మొత్తం పూర్తి చేసుకుని అక్టోబర్ 2 రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. దసరా ఆప్షన్ కూడా పరిశీలించారు కానీ దానికన్నా మొదటి వారం అయితే బెటరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. దీని వల్ల థియేటర్ రన్ కు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు నిర్మాత నాగవంశీ త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేయొచ్చు.
స్టోరీ, కంటెంట్ గురించి లీక్స్ సంగతి ఎలా ఉన్నా ఆదర్శ కుటుంబం మీద కుటుంబ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించాలనేది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అది నెరవేరుతోంది. ఆయన డైలాగులు రాసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటివి అంత గొప్ప విజయం సాధించినప్పుడు ఇప్పుడు మాటల మాంత్రికుడే మెగా ఫోన్ పట్టుకుంటే దగ్గుబాటి అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.
ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి వచ్చేస్తుంది కాబట్టి దానికి ఆదర్శ కుటుంబంకు కనీసం మూడు నెలల గ్యాప్ ఉండటం అవసరం, నిర్మాతలు ఆ కోణంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఫ్యామిలీలో ఏకే 47 ప్రవేశించేంత అలజడి ఏం రేగిందనే పాయింట్ మీద దీన్ని రూపొదించారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కొట్టినా గుంటూరు కారం నిరాశ పడటంతో ఇప్పుడు అందరి కళ్ళు త్రివిక్రమ్ మీదే ఉన్నాయి. అంచనాలు అందుకుంటే వసూళ్ల మోతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates