ఓదెల ‘మెగా’ ప్రాజెక్టు… స్ట్రాటజీ మార్చాల్సిందే

భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా చిరంజీవి ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. వీలైనంత వేగంగా సినిమాలు చేస్తూ నెంబర్ పెంచుకోవాలని చూస్తున్నారు. ఒకరకంగా ఈయనతో పాటు బాలయ్య, నాగ్, వెంకీలు కౌంట్ పరంగా ఇస్తున్న కాంపిటీషన్ యూత్ హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంత ప్లాన్డ్ గా ఉన్నా సరే విశ్వంభర ఆలస్యం చిరుతో పాటు అభిమానులను ఇరిటేట్ చేసింది.

అందుకే ఇకపై ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నారు చిరు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 కేవలం వంద వర్కింగ్ డేస్ లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారట. అదే నిజమైతే 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ ఉంటుంది. విశ్వంభరని దసరా పండగ కానుకగా విడుదల చేసే ప్రణాళిక ప్రతిపాదన స్టేజిలో ఉంది. సరే ఇదంతా బాగానే ఉంది కానీ చిరు నెక్స్ట్ చేయాల్సిన సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అన్న సంగతి తెలిసిందే.

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా ఎప్పుడో ఈ కాంబో అధికారికంగా ప్రకటించారు. అయితే నాని లాంటి వయసులో ఉన్న కో ఆపరేటివ్ హీరోతోనే ఇంత ఆలస్యం చేస్తున్న శ్రీకాంత్ ఓదెల మరి చిరంజీవి విషయంలోనూ ఇలాగే చేస్తే ఇబ్బందులు తప్పవు. ప్యారడైజ్ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. విడుదల తేదీలు మారుతూనే ఉన్నాయి. ఆరు నూరైనా ఆగస్ట్ 21 పక్కా అన్నారు. కానీ మాట మీద నిలబడలేదు. ఇప్పుడు సెప్టెంబర్ అంటున్నారు కానీ దానికీ గ్యారెంటీ లేదు.

ఈ పోస్ట్ పోన్లతో నాని కొంత అసహనంగా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు సుజిత్ బ్లడీ రోమియో కన్నా ముందు ఓజి 2 చేయాలని నిర్ణయించుకోవడం వెనుక కారణం ఇదేనంటున్నారు. చిరంజీవితో నిజంగా శ్రీకాంత్ ఓదెల సినిమా తీసే పనైతే ఆరేడు నెలల్లో గుమ్మడికాయ కొట్టేలా చూసుకోవాలి. అంతే తప్ప సంవత్సరాల తరబడి తీస్తానంటే చాలా సమస్యలు వస్తాయి. ప్యారడైజ్ రిలీజైన వెంటనే మెగా మూవీకి సంబంధించిన క్లారిటీ వీలైనంత వేగంగా ఇస్తే బెటర్.