పెద్ది మళ్ళీ ట్రాకులోకి వచ్చాడు

రెండో వారంలో పెద్ది జోరు కొనసాగుతోంది. జాన్వీ కపూర్ పాత్ర వివాదం, ఎడిటింగ్ చేస్తామని బుచ్చిబాబు వివరణ, కొత్త సీన్లు జోడిస్తారనే ప్రచారం ఇవేవీ నిజం కానప్పటికీ సామాన్య ప్రేక్షకులకు థియేటర్ వెళ్లేందుకు ఉన్న ప్రధానమైన ఆప్షన్ ఇదే కావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. నిన్న ఒక్క బుక్ మై షోలోనే 1 లక్ష 55 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మంచి సంకేతం. అయితే రేట్ల పెంపుకి జూన్ 13 చివరి తేదీ అయినప్పటికీ ఇవాళ కొన్నిఏపీ సెంటర్స్ లో హైక్స్ అలాగే ఉన్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే పెద్దికి భారీ నెంబర్ నమోదయ్యే అవకాశం ఈ రోజే ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి పీక్ వర్కింగ్ డేస్ మొదలైపోతాయి. స్కూళ్లు, కాలేజీలు తెరిచేశారు. ఒకపక్క రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్రంగా ఉన్నాయి. ఇవి ఆక్యుపెన్సీలను దెబ్బ తీస్తాయి. సెలవు రోజు ఏదోలా థియేటర్లకు వస్తారు కానీ వీక్ డేస్ లో వాతావారణం అనుకూలంగా లేకపోతే ఆ ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడటం ఖాయం.

నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న పెద్ది ఆ మార్క్ దాటినా తర్వాత అంతకంటే ముందుకు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. మెగా ఫ్యాన్స్ అయిదు వందల కోట్ల గ్రాస్ ఆశించారు. అయితే మాస్ వర్గాలను పెద్ది పూర్తిగా సంతృప్తి పరచలేకపోవడం, ఎలివేషన్ లేకుండా ఎమోషన్ డామినేట్ చేయడం లాంటి కారణాలు రిపీట్ వేల్యూని తగ్గించాయి. దానికి తోడు రోజుల తరబడి టికెట్ రేట్లు భారీగా ఉండటం సగటు మధ్యతరగతి జనాలను దూరం చేసింది.

వచ్చే వారం మా ఇంటి బంగారం, దీవానా, వంద దేవుళ్ళు వస్తున్నాయి. దేనికవే విస్తృత ప్రమోషన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో పెద్ది ఆలోగానే వీలైనంత రాబట్టుకోవాలి. ఒకవేళ కొత్త రిలీజులు కనీస స్థాయిలో పబ్లిక్ ని మెప్పించలేకపోతే రామ్ చరణ్ బృందానికి ఇంకో వీకెండ్ దొరుకుతుంది. అలా కాకుంటే ఫైనల్ రన్ దగ్గర పడుతోందని చెప్పొచ్చు. ఆదివారం మధ్యాహ్నం టీమ్ ప్రెస్ మీట్ పెట్టేసి బుధవారం సక్సెస్ వేడుక చేయబోతున్నారు. దానికి రామ్ చరణ్ హాజరు ఉంటుంది.