‘బిల్లా రంగా’ను గుర్తు చేసిన సిరీస్

చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా 1982లో బిల్లా రంగా అనే సినిమా వచ్చింది. కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. అప్పట్లో ఈ పేర్లకు మంచి క్రేజ్ ఉండేది. వాటి వెనుక ఉన్న చీకటి కోణం చాలా మందికి తెలియదు. అదేంటో ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ ‘రాఖ్’ తవ్వి తీసే ప్రయత్నం చేసింది. 1978లో దేశం మొత్తాన్ని ఒక జంట హత్యల కేసు కుదిపేసింది. ఒళ్ళు జలదరించే విధంగా రెండు పసి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కోట్ల హృదయాలను తల్లడిల్లేలా చేసింది.

ఆర్మీ ఆఫీసర్ పిల్లలు గీత, సంజయ్ చోప్రా ఒక పాటల ప్రోగ్రాం కోసం రేడియో స్టేషన్ కు వెళ్తూ కనిపించకుండా పోతారు. పోలీసులు విచారణ మొదలుపెడతారు. రెండు రోజుల తర్వాత ఒక అడవి లాంటి ప్రాంతంలో ఇద్దరి శవాలు దొరుకుతాయి. ఇన్వెస్టిగేషన్ లో అవి చేసింది కరుడు గట్టిన కుల్జీత్ సింగ్, జస్బీర్ సింగ్ అని తేలుతుంది. వీళ్ళే బిల్లా రంగాగా పేరు మోసిన హంతకులు. ఇదంతా ఎలా జరిగింది, వాళ్ళ వెనుక నేపథ్యం ఏంటనేది రాఖ్ సిరీస్ లో పూర్తిగా కవర్ చేశారు.

టెక్నాలజీ, సీసీ కెమెరాలు ఇవేవి లేని రోజుల్లో ఇద్దరు టీనేజ్ పిల్లల మర్డర్ కేసుని ఛేదించడానికి పోలీసులు ఏం చేశారనేది రాఖ్ లో చక్కగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్ల సుదీర్ఘ నెరేషన్ కావడంతో ల్యాగ్ అయితే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు ప్రోసిత్ రాయ్. బ్లాక్ బస్టర్ పాతాల్ లోక్ తీసింది ఈయనే. బిల్లా రంగాగా నటించిన ఇద్దరు ఆర్టిస్టులు ప్రాణం పోస్తే పోలీస్ ఆఫీసర్ గా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. మురారి, శంకర్ దాదా MBBS హీరోయిన్ సోనాలి బెంద్రే ఇందులో చనిపోయిన పిల్లల తల్లిగా కొన్ని ఎమోషనల్ సీన్లకు పరిమితమయ్యారు.

క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళను రాఖ్ నిరాశ పరచదు. కాకపోతే ఇలాంటివి గత నాలుగేళ్ళలో లెక్కలేనన్ని చూశాం కాబట్టి కంటెంట్ పరంగా మరీ కొత్తగా అనిపించదు. అయితే 70 దశకంలోనే నేరాలు ఎంత ఘోరంగా జరిగేవో తెలుసుకుంటే ఆశ్చర్యంతో కూడిన షాక్ తగులుతుంది. అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ రూపంలో చక్కగా ఆవిష్కరింపజేశారు. అక్కడక్కడా ఓపికని డిమాండ్ చేసే రాఖ్ హిందీ రాని ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ తో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది.