రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక రంగస్థలంతో నటుడిగా ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేసి చిరు గర్వించేలా చేశాడు. ఆర్ఆర్ఆర్తో ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చిరు దెగ్గరకు వెళ్ళిపోయడనుకోవడంలో సందేహం లేదు. తాజాగా పెద్ది సినిమాతో నటుడిగా మరోసారి అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు చిరు తనయుడు.
ఈ చిత్రంలో చరణ్ నటనే కాదు.. పెద్ది పాత్ర కోసం అతను శారీరకంగా పడ్డ కష్టం, తెర మీద తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ప్రశంసలు అందుకున్నాయి. చరణ్ను సినీ ప్రియులు కొనియాడుతున్న తీరు చూసి చిరు ఎంతో గర్విస్తూ ఉంటాడనడంలో సందేహం లేదు. ఐతే తన కొత్త సినిమా షూటింగ్ కోసం గత వారం కేరళకు వెళ్లిన చిరు.. ఇప్పుడే తిరిగి హైదరాబాద్కు వచ్చారు. రాగానే పెద్ది షో చూసిన అనంతరం దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరు తన పుత్రోత్సాహాన్ని చూపించారు. పెద్ది పాత్రలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి తాను కదిలిపోయినట్లు చిరు చెప్పారు. ఒక నటుడు తెర మీద ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా ఏడుస్తారని, కానీ తాను ఏడవకుండానే చరణ్ ప్రేక్షకులను ఏడిపించేశాడని చిరు వ్యాఖ్యానించారు. భావోద్వేగాలను పంటి బిగువన అణచుకుని, కళ్ల ద్వారా హావభావాలను చరణ్ పలికించిన తీరు అద్భుతమని చిరు అన్నారు. అప్పలసూరి పాత్ర మరణానంతరం చరణ్ పాత్ర సాగిన తీరు తనను మంత్రముగ్ధుడిని చేసిందని ఆయనన్నారు.
చరణ్ నటనను అందరూ కొనియాడుతుండడం చాలా సంతోషంగా ఉందన్న చిరు.. చరణ్ తనను మించి ఎదిగిపోయాడు అంటుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందని చెప్పారు. కానీ ఒక నటుడిగా మాత్రం ఈ మాటను తీసుకోవడం కష్టంగా ఉందంటూ నవ్వుతూ చెప్పారు.
ఈ సినిమాలో చరణ్ బాగా నటించాడు అని తన భార్య సురేఖ చెప్పగా.. అతను నటించలేదు జీవించాడు అని తాను ఆమెతో అన్నట్లు చిరు వెల్లడించారు. పెద్ది సినిమాలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి చాలామంది తనను చరణ్జీవి అని అంటున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పగా.. ఇదేదో కొత్తగా ఉంది, ఎప్పుడూ వినలేదే అంటూ చిరు నవ్వేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
