ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆమెదే. ‘క్వీన్’ మూవీతో ఈ ఘనతను సాధించింది కంగనా. ఆ తర్వాత ఆమె లీడ్ రోల్ చేసిన ‘మణికర్ణిక’ సైతం అదే స్థాయిలో విజయవంతం అయింది. దీంతో వరుసగా కంగన ప్రధాన పాత్రలో సినిమాలు తెరకెక్కాయి. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్కి ఒకప్పుడు మినిమం ఓపెనింగ్స్ ఉండేవి.
కానీ ఎప్పుడైతే కంగనా లేని పోని వివాదాల్లోకి వెళ్లడం.. కొందరు బాలీవుడ్ ప్రముఖులను అదే పనిగా టార్గెట్ చేయడం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి హద్దులు దాటి మాట్లాడ్డం మొదలుపెట్టిందో.. అప్పట్నుంచి ఆమె పట్ల జనాల్లో వ్యతిరేకత మొదలైంది. అది క్రమంగా తార స్థాయికి చేరుకుని కంగనా సినిమాలకు నెగెటివ్గా మారిపోయింది.
ఒకప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించే స్థాయి నుంచి పట్టుమని పది కోట్లు కూడా రాని స్థితికి చేరుకుంది కంగనా.
ధకడ్, ఎమర్జెన్సీ లాంటి సినిమాలు టాక్తో సంబంధం లేకుండా దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఏదీ డబుల్ డిజిట్ కలెక్షన్ల మార్కును అందుకోలేకపోయింది.
‘ఎమర్జెన్సీ’కి పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కంగనా కొత్త సినిమా ‘భారత్ భాగ్య విదాత’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. టాక్ కూడా బాగుంది. కానీ సినిమా చూడ్డానికి థియేటర్లలో జనమే లేరు.
ఈ చిత్రం తొలి రోజు కేవలం కోటి రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది ఇండియాలో. ఇది డిజాస్ట్రస్ ఓపెనింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కంగనా సినిమా బాగుందన్నా జనాలు చూడడానికి రెడీగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు కంగనా పేరు చెప్పి సినిమాలను సేల్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆమె పేరే మైనస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై కంగనాతో సినిమాలు తీయాలంటే నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
