‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మాస్ మూవీ కావడం, పైగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించడం.. తమన్నా హీరోయిన్గా చేయడంతో దీనికి హైప్ మామూలుగా లేదు.
కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది.
ఐతే ‘రెబల్’ సినిమా రిలీజ్కు ముందే, మేకింగ్ మధ్యలో ఉండగానే డిజాస్టర్ అవుతుందని నిర్మాతలకు అర్థం అయిపోయిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు బాలాజి ఆర్ట్స్ అధినేతలు భగవాన్, పుల్లారావు.
‘రెబల్’ సినిమా రిజల్ట్ విషయంలో దర్శకుడు రాఘవ లారెన్స్పై మీకు కోపం ఉందా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే.. ఆ సినిమా రిలీజ్ టైంలో ఆయనపై నిజంగానే కోపం ఉండేదని భగవాన్, పుల్లారావు తెలిపారు. ఈ సినిమాకు తాము అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు అయినట్లు వారు వెల్లడించారు.
తాము పెట్టుకున్న బడ్జెట్ సినిమా మధ్యలోకి వచ్చేసరికే అయిపోయిందని.. మిగతా సగం సినిమాకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా అనే అయోమయం నెలకొందని భగవాన్, పుల్లారావు చెప్పారు. ఐతే లారెన్స్ సినిమాకు ఖర్చు చేయించే విషయంలో ఏమాత్రం రాజీపడలేదని.. అవసరమైన ప్రతిదీ కావాలని అడిగేవాడని.. తాము ఎలాగోలా సర్దుబాటు సినిమాను పూర్తి చేశామని వారు తెలిపారు. ఐతే బడ్జెట్ రెట్టింపు అవ్వడంతో ఈ సినిమా ఆడదని, రిలీజ్ కూడా కష్టమని ఇండస్ట్రీలో ముందే ఒక అభిప్రాయం వచ్చేసిందన్నారు.
ఐతే ప్రభాస్ హీరో కావడం వల్లే ఆ సినిమాను రిలీజ్ చేయగలిగామని వారు తెలిపారు. ‘రెబల్’ 2012లో రిలీజ్ కాగా.. ఈ సినిమా దెబ్బకు భగవాన్, పుల్లారావు చాలా ఏళ్ల పాటు ప్రొడక్షన్కు దూరం అయిపోయారు. చాలా గ్యాప్ తర్వాత 2017లో గౌతమ్ నంద, 2021లో రిపబ్లిక్ లాంటి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేసినా.. అవి కూడా వారిని నిరాశకే గురి చేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
