రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. దీపావళి రిలీజ్ అని అధికారికంగా ముందే ప్రకటించారు కాబట్టి అభిమానులు ఎప్పుడెప్పుడు నవంబర్ వస్తుందాని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ప్రమోషన్స్ పరంగా టీమ్ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. దర్శకుడు నితేశ్ తివారి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో, విఎఫ్ఎక్స్ లో బిజీగా ఉన్నారు.

నాలుగు వేల కోట్లతో రామాయణ రూపొందుతోందని నిర్మాత నమిత్ మల్హోత్రా గతంలో చెప్పారు. ఇది ఊహకందని బడ్జెట్. అయితే ఇంత మొత్తం రికవర్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమోఘమైన ఆదరణ దక్కించుకోవాలి. దానికి తగ్గట్టే మార్కెటింగ్ జరగాలి. ఎందుకంటే రామాయణ మన దేశానికి సంబంధించిన పురాణ గాథ కాబట్టి గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ కావడం అంత సులభంగా ఉండదు. వాళ్ళను ముందు నుంచే ప్రిపేర్ చేయడం అవసరం.

ఎప్పుడో ఏడాది తర్వాత రిలీజయ్యే వారణాసికి రాజమౌళి ఇప్పటి నుంచే మార్కెటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మహేష్, ప్రియాంకా, పృథ్విరాజ్ ప్రత్యేకంగా ఫారిన్ జర్నలిస్టులతో ముచ్చటించారు. టీమ్ తరఫున ఎస్ఎస్ కార్తికేయ పలు ఫిలిం ఫెస్టివల్స్ కు రిప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నవి. వందల కోట్ల బిజినెస్ జరగాలంటే ఈ మాత్రం ప్లానింగ్ అవసరమే.

కానీ రామాయణ ఇంకా ఎలాంటి సౌండ్ చేయకపోవడం ఆశ్చర్యం. రన్బీర్ కపూర్ అప్పుడప్పుడు బయట ఈవెంట్స్ లో ఫెస్టివల్స్ లో కబుర్లు పంచుకుంటున్నాడు కానీ అవి జనాలకు అంతగా రిచ్ కావడం లేదు. రావణుడిగా నటించిన యష్ ది మరో సమస్య. దీని గురించి చెప్పుకోవాలో తన టాక్సిక్ గురించి ప్రమోట్ చేసుకోవాలో అర్థం కాక రెండింటి గురించి చెబుతున్నాడు. విచిత్రం ఏమిటంటే 2026లోనే రిలీజయ్యే రామాయణ, టాక్సిక్ రెండు రిలీజ్ డేట్లు ఇప్పటిదాకా ఫైనల్ కాలేదు.