టాలీవుడ్ లో విపరీతమైన హాట్ టాపిక్ గా మారిన నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటెజ్ వివాదం ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. ఆయన్ని పెద్దగా భావించి తమ సమస్యలు విన్నవించుకుంటామని ఎగ్జిబిటర్లు మొన్న ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఈ వివాదం మొదలైనప్పుడు, ఒకవేళ తెలంగాణ సింగల్ స్క్రీన్లలో పెద్ది వేయకపోతే చిరంజీవి, చరణ్ ని కలుస్తామని నిర్మాత నాగవంశీ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
ఇక ఈ రోజు జరిగిన మీటింగ్ విషయానికి వస్తే దిల్ రాజు చెప్పిన సారాంశం చాలా సింపుల్ గా ఉంది. రెండు రోజుల్లో పరిష్కారం వస్తుందని, అంతా సవ్యంగా జరిగిందని, ప్రదర్శకుల ఇబ్బందులను సావధానంగా చిరంజీవి విన్నారని చెప్పుకొచ్చారు. ఇన్ సైడ్ టాక్ అయితే ఎగ్జిబిటర్ల దూకుడుని ప్రశ్నించిన చిరంజీవి ఇన్నేసి నెలలు, సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారనే పాయింట్ మీద ఎక్కువ డిస్కస్ చేశారట. గతంలో జరిగిన సమావేశాల వివరాలు తెలుసుకున్నారట.
చూస్తుంటే జూన్ 4 విడుదల కాబోతున్న పెద్దికి ఆటంకాలు లేకుండా ప్రస్తుతానికి రూట్ క్లియర్ చేసి వచ్చే నెల చివరిలోగా ఖచ్చితంగా పరిష్కారం చూపించే విధంగా చిరంజీవి నుంచి హామీ దక్కినట్టు అంతర్గతంగా వినిపిస్తోంది. ఇక్కడితో అయిపోలేదు. నిర్మాతలు కూడా చిరుని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారట. రేపో ఎల్లుండో క్లారిటీ రావొచ్చు. ముందు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ తర్వాత ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారని వినిపిస్తోంది.
అయితే అన్నయ్య మాటను కాదనని తమ్ముడు దానికి భిన్నంగా ఏదైనా సలహా ఇస్తారని అనుకోలేం కానీ ముందైతే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం చాలా ఉంది. పెద్దికి టైం చాలా తక్కువగా ఉండటంతో, ఇటీవలే ఏర్పాటైన కమిటీ రిపోర్ట్ కు గడువు ఇచ్చి ఆపై రిలీజయ్యే సినిమాలకు మాత్రం పర్సెంటెజ్ అమలయ్యేలా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికైతే వాతావరణం కొంత కూల్ అయ్యింది కానీ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇంకేం ప్రణాళికలు వేస్తారో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates