సింగీతం ఒక్కరే రిస్క్ చేస్తున్నారు

తొంభై ఏళ్ళ వయసు దాటినా ఇంకా దర్శకత్వం చేయడానికి తపన చూపిస్తున్న దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు తప్ప ఇంకో పేరు ఎక్కడా కనిపించడం లేదు. ఒకరిద్దరు విదేశీ ఫిలిం మేకర్స్ ఉన్నప్పటికీ గతంలో చేశారు కానీ వర్తమానంలో కాదు. అందుకే సింగ్ గీతం సినిమా మీద ప్రత్యేక అంచనాలు నెలకొంటున్నాయి. నాగ్ అశ్విన్ నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం లాంటివి క్రమంగా ఈ ప్రాజెక్టు మీద ఆసక్తిని పెంచుతున్నాయి.

నిన్న వైజాగ్ లో ఈవెంట్ చేసి హీరో స్థానికుడు కావడంతో అక్కడ నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టారు. ప్రతి చోట సింగీతం రాలేరు కాబట్టి ఆ లోటుని టీమ్ అంతా వైవిధ్యంగా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది. జూన్ 11 సింగ్ గీతం రిలీజ్ అవుతోంది. అయితే పెద్ది వచ్చిన వారం ముందు ఆ తర్వాత వేరే సినిమాలు విడుదల చేసే సాహసం ఇతర నిర్మాతలు చేయడం లేదు. అందుకే సమంత మా ఇంటి బంగారం, గీత ఆర్ట్స్ పంపిణి చేస్తున్న దీవానా కొంచెం లేట్ గా జూన్ 19 వస్తున్నాయి.

సింగ్ గీతం బృందంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ఒకటే. కంటెంట్ లో బలముంది కాబట్టి పెద్ది కాంపిటీషన్ ఉన్నా సరే ఒక వర్గం ప్రేక్షకులు ముందు దీని వైపు టర్న్ అవుతారనే నమ్మకంతో డేట్ ఫిక్స్ చేసుకున్నారు. పైగా పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సింగీతం వారికి ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా రిస్క్ ఉండదు కాబట్టి హిట్ టాక్ వచ్చిందంటే వేగంగా లాభాల్లోకి వెళ్లిపోవచ్చు.

ఈ సినిమా ఎలా ఉంటుందనే ఆలోచన కన్నా సింగీతం గారు ఇంత లేట్ ఏజులో ఇలాంటి ప్రయత్నం చేసినందుకైనా చూడాలి. టీజర్ లో విజువల్స్ ఆసక్తికరంగా అనిపించాయి. మొదటి లిరికల్ సాంగ్ డిఫరెంట్ గా ఆకట్టుకునేలా సాగింది. ఎటొచ్చి స్టోరీ ఏంటనేది ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా టీమ్ కంటెంట్ వదులుతోంది. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, విచిత్ర సోదరులు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని దశాబ్దాల క్రితమే ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు గారు ఈసారి ఏం మాయాజాలం చేస్తారో.