ఢిల్లీ ఎపిసోడ్ అంత కీలకమా

పెద్ది గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాట క్లైమాక్స్. చివరిలో చాలా ఎమోషనల్ అవుతారని, ఎంత కమర్షియల్ సినిమా అయినా భావోద్వేగాలను అణుచుకోలేరనే స్థాయిలో దర్శకుడు బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరూ చేయని రిస్క్ చరణ్ చేశాడంటూ యూనిట్ వర్గాలు అక్కడక్కడా లీకులు ఇస్తూ వచ్చాయి. ఉప్పెనకి వంద రెట్లు ఎక్కువ షాక్ వేల్యూ దీంట్లో ఉంటుందని స్వయంగా హీరో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతర్గత వర్గాల కథనం ప్రకారం ఢిల్లీ ఎపిసోడ్ సుమారు నలభై అయిదు నిమిషాలకు పైగానే ఉంటుందట. భాష రాకపోయినా ఒక ఉన్నత లక్ష్యం కోసం దేశ రాజధాని చేరుకున్న పెద్దికి ఎదురయ్యే అవమానాలు, వాటిని అతను ఎదురుకున్న విధానం రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా చాలా డీప్ గా టచ్ చేసేలా ఉంటుందట. సుమారు ఇరవై నిమిషాల పాటు ఇది చరణ్ సినిమానా లేక మణిరత్నం, గౌతమ్ మీనన్ తీశారా అనిపించేలా చాలా లోతుగా వెళ్లినట్టు చెబుతున్నారు.

కమర్షియల్ స్కేల్ ని ఢిల్లీ ఎపిసోడ్ ప్రభావితం చేస్తుందని లోపలి నుంచి వినిపిస్తున్న మాట. ఇది కనక క్లిక్ అయితే రవికిషన్ అన్నట్టు అవార్డులతో పాటు రిపీట్ వేల్యూతో అభిమానులను కట్టి పారేయడం ఖాయం. ఢిల్లీకి వెళ్లే ముందు ఒక మాస్ ప్యాకేజ్, ఢిల్లీకి చేరుకున్నాక ఒక క్లాస్ భోజనం తరహాలో బుచ్చిబాబు రెండు బ్యాలన్స్ చేశారని తెలిసింది. ఏఆర్ రెహమాన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వీటికి ఎలా ప్రాణం పోస్తాడనే దాని మీద కనెక్టివిటీ ఆధారపడి ఉంది.

ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే చేతిలో కేవలం తొమ్మిది రోజులే ఉండటంతో పెద్ది బృందం పరుగులు పెడుతోంది. చెన్నైలో చివరి దశ పనులు చూసుకుంటూ బుచ్చిబాబు బిజీగా ఉండగా, నిర్మాత ఇక్కడ నైజం సింగల్ స్క్రీన్ల వివాదం మళ్ళీ ఏర్పడ్డ నేపథ్యంలో దాన్ని అత్యవసరంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ 3 ప్రీమియర్ షోలు వేస్తారా లేదానే క్లారిటీ ఇంకా రాలేదు. తెలంగాణలో ఉంటాయనే హామీ దొరికాకే ఏపీ షోల గురించి ప్రకటన వస్తుంది.