బెనిఫిట్ షో వల్ల ఎలాంటి లాభం లేదా

పెద్ద హీరోల సినిమా బెనిఫిట్ షో అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజ్ కు ముందు రోజు అర్ధరాత్రి వేసే వాటికి అభిమానులు ఎగబడి టికెట్లు కొంటారు. ఏపీలో ఓజికి వెయ్యి రూపాయలు పెట్టినా హౌస్ ఫుల్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది. వచ్చే ఏడాది వారణాసికి అయిదారు వేలన్నా లెక్క చేసేలా లేరు. అయితే సింగల్ స్క్రీన్లలో వీటివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎగ్జిబిటర్ స్వయంగా చెప్పడమంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.

కానీ ఇది నిజం. మా ప్రతినిధికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసిద్ధ సుదర్శన్ థియేటర్ యజమాని బాల్ గోవింద్ రాజ్ కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. వాటిలో ప్రీమియర్ షోల ప్రస్తావన ఉంది. అంత టికెట్ రేట్ పెట్టి వాటిని వేసినా కూడా పైసా లాభం రాదని, కేవలం తమకు అద్దెలు మాత్రమే ఇస్తారని. మిగిలిన ఖర్చులు అన్నీ తామే భరించి చివరికి చూసుకుంటే ఏం మిగలదని అన్నారు. పుష్ప 2 సంధ్య థియేటర్ ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒకవేళ ఈ షోలు వేయమంటే తమకు సినిమా ఇవ్వకుండా బెదిరించే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు లేకపోలేదని షాక్ ఇచ్చారు. సిబ్బంది ఓవర్ డ్యూటీ, పోలీస్ సెక్యూరిటీ, అదనపు ఏర్పాట్లు, కరెంట్ బిల్లు, ప్రాపర్టీ డ్యామేజ్ ఇవన్నీ సింగల్ స్క్రీన్ యాజమాన్యాలే భరించాల్సి ఉంటుంది. వచ్చే కలెక్షన్ అంతా నిర్మాత తీసుకెళ్ళిపోయి కేవలం అద్దె మాత్రమే ఇస్తే ఇది కిట్టుబాటు కాదు. పైగా ఇంత శ్రమ చేసినందుకు ఒకటే ఆదాయం, చేయకపోయినా అదే ఆదాయం అన్నట్టుగా మారిపోతుంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం గురించి రేగుతున్న వివాదం కొత్త మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాల్ గోవింద్ రాజ్ వ్యాఖ్యలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఒక స్టార్ సినిమాకు కోటి రూపాయలు వస్తే దాంట్లో ఆరేడు లక్షలు మాత్రమే ఓనర్ కు వస్తుందని, అదే మల్టీప్లెక్స్ అయితే నలభై ఐదు లక్షల దాకా ఇస్తారని చెబుతున్న ఈ సీనియర్ ఎగ్జిబిటర్ మా పోరాటం ఈ సమస్య మీద తప్పించి పెద్ది గురించి కాదంటున్నారు.