జూన్ 4 విడుదల కాబోతున్న పెద్దికి నైజామ్ సింగల్ స్క్రీన్లలో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్న టైంలో మరోసారి షాక్ తగిలింది. హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్న ఎగ్జిబిటర్లు పెద్దితో సహా ఇకపై ఏ సినిమా వేయాలన్నా ముందు పర్సెంటెజ్ సంగతేంటో చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ తేల్చి చెప్పేశారు. అందరూ కూచుని మాట్లాడుకుందామని, ఎక్కువో తక్కువో ముందు ఎంత ఇస్తామో స్పష్టంగా చెబితే తమకు అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు.
సో పెద్దికి మినహాయింపు ఉంటుందని, నైజామ్ లో ఏ సమస్య లేదని భావిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. దీనిపై స్పందించేందుకు మైత్రి నిర్మాతలు అందుబాటులో లేరు. భోపాల్ లో జరుగుతున్న భారీ సాంగ్ ఈవెంట్ కోసం అందరూ అక్కడికి వెళ్లారు. సో స్పందన రేపటికి రావొచ్చు లేదా ఎవరో ఒకరు ఆన్ లైన్ ద్వారానో లేదా ఇతర ప్రొడ్యూసర్లు ఎవరైనా నేరుగానో స్పందించే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్లు మాత్రం గట్టి పట్టుదలగా కనిపిస్తున్నారు.
ఇటీవలే ఛాంబర్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశాక పరిణామాలు మారిపోయాయి. ప్రదర్శకులను ఒక తాటిపైకి తెచ్చేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు కానీ అవి ఎంత వరకు కొలిక్కి వస్తాయో అంతు చిక్కడం లేదు. నైజామ్ లో టికెట్ రేట్ల పెంపు వద్దని ఎగ్జిబిటర్లు చెప్పడమే కాదు సిఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా ఇచ్చామని చెప్పడం సంచలనం రేపుతోంది. అంటే నిర్మాత అడిగి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా హైక్స్ అమలు చేయమని నేరుగా చెబుతున్నారు.
పెద్ది కేవలం పది రోజుల దూరంలో ఉంది. ఇప్పుడీ ఇష్యూ వల్ల థియేటర్ అగ్రిమెంట్లు పెండింగ్ లో పడతాయి. అసలే సరైన స్టార్ హీరో మాస్ సినిమా లేక నాలుగు నెలలుగా బాక్సాఫీస్ డ్రైగా ఉంది. ప్రేక్షకులు వేరే ఆప్షన్ లేక డబ్బింగులకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటి టైంలో పెద్ది వస్తుంటే చిక్కుముడులు ఎదురవుతున్నాయి. నైజామ్ ఎగ్జిబిటర్ల కోరికలు న్యాయంగా అనిపిస్తున్నా ఇది పరిష్కరించే దిశగా చొరవ ఎవరు తీసుకుంటారనేది వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates