ముందే రాబోతున్న మెగా మూవీ?

ఈ రోజుల్లో సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడడమే తప్ప.. చెప్పిన రిలీజ్ డేట్ కంటే ముందే ఒక పెద్ద సినిమాను రిలీజ్ చేయడం అన్నది చాలా అరుదైపోయింది. ఈ ఏడాది వేసవి సీజన్ ఆరంభంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని ఇలాగే అనుకున్న దాని కంటే వారం ముందుగా విడుదల చేసి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. కానీ అదేమంత గొప్ప సినిమా కాకపోవడంతో ప్రిపోన్ చేయడం పెద్ద విశేషం కాలేకపోయింది.

ఐతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమాను వారం ముందు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారంటే అది కచ్చితంగా పెద్ద విషయమే. ‘రామాయణం’ పార్ట్-1 విషయంలో ఈ దిశగానే ఆలోచిస్తోందట నిర్మాణ సంస్థ. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 7న రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు నిర్మాత నమిత్ మల్హోత్రా ఆలోచన మారిందట. వారం ముందే, అంటే అక్టోబరు 31న ‘రామాయణం-1’ను రిలీజ్ చేయాలని డిసైడయ్యారట.

ఇలాంటి పెద్ద సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా తొలి వారంలో వసూళ్లకు ఢోకా ఉండదు. అందుకే దీపావళి కంటే వారం ముందే రిలీజ్ చేసి, తొలి వారంలో భారీ వసూళ్లు తెచ్చుకుంటే.. తర్వాత పండుగ వీకెండ్లో ఎలాగూ మంచి కలెక్షన్లు తెచ్చుకోవచ్చన్నది నిర్మాత ఆలోచనగా కనిపిస్తోంది.

సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న నమిత్ మల్హోత్రా.. తొలి వీకెండ్ కంటే రెండో వీకెండ్లో అధిక కలెక్షన్లు రాబట్టవచ్చని.. రెండో వారంలో మొమెంటం మరింత పెరుగుతుందని, వసూళ్లు కూడా ఎక్కువ వస్తాయని.. తద్వరా సినిమా మీద ప్రేక్షకుల్లో ఒక పాజిటివిటీ పెరిగి.. సినిమాకు లాంగ్ రన్ వస్తుందని భావిస్తున్నారట.

మార్కెటింగ్ కోణంలో ఇది చాలా మంచి ఆలోచన అని భావించి దీపావళి వీకెండ్ కంటే ముందే సినిమాను రిలీజ్ చేయాలని డిసైడైనట్లు సమాచారం. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించారు. ఐతే తొలి భాగంలో రావణుడి పాత్ర జస్ట్ పరిచయం వరకే ఉంటుంది. రాముడి పుట్టుక నుంచి ఆయన అరణ్య వాసానికి వెళ్లే వరకు చూపిస్తారని సమాచారం.