మూర్తిగారు చెబుతున్నారు.. ఇండస్ట్రీ వింటుందా?

ఈ మధ్యే తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు ఇస్తూ.. టాలీవుడ్ మీద కొన్ని వరాలు కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో భాగంగానే థియేటర్లలో ఎన్ని కావాలనుకుంటే అన్ని షోలు వేసుకోవడానికి, టికెట్ల ధరలు ఎంత అనుకుంటే అంత పెంచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఐతే థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుని జనాలు నెమ్మదిగా అటు వైపు వస్తున్న నేపథ్యంలో వెంటనే టికెట్ల రేట్లు పెంచి వారిని భయపెట్టడం ఎందుకనో ఏమో.. ఇప్పటి వరకు అయితే టికెట్ల ధరలు పెంచట్లేదు. ఇక షోలు పెంచాల్సినంత డిమాండ్ అయితే అసలే లేదు. ఐతే సంక్రాంతి సమయానికి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ సమయంలో షోలతో పాటు టికెట్ల ధరలు కూడా పెంచేస్తారేమో అన్న భయాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అసలే 50 పర్సంట్ ఆక్యుపెన్సీ వల్ల రెవెన్యూ తగ్గుతున్న నేపథ్యంలో టికెట్ల రేట్లు పెంచి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఐతే సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి మాత్రం ఆ పని చేయొద్దని ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేయడం విశేషం. క్రిస్మస్ కానుకగా విడుదలైన సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రంలో రెండు మూడు చోట్ల నారాయణ మూర్తి రెఫరెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.

ఈ వేడుకలో ఆయన టికెట్ల రేట్ల పెంపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా ప్రభావం అన్నీ రంగాలపై పడింది. ముఖ్యంగా సినీ రంగంపై కూడా ఎక్కువగా పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి సమయంలో కోర్టులకు వెళ్లి టికెట్ల రేట్లు పెంచుకోకండి. ఎంత బడ్జెట్‌ మూవీ అయినా టికెట్‌ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్‌ కాదు. అలా చేస్తే అది ఆథరైజ్డ్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ అవుతుంది. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకండి. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ గారు ఒప్పుకోవద్దని కోరుతున్నాను” అని నారాయణ మూర్తి అన్నారు. ఐతే మంచి ఉద్దేశంతో చెప్పిన ఈ మాటల్ని టాలీవుడ్ నిర్మాతలు అర్థం చేసుకుంటారా?