త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న కథానాయిక అంటే త్రిషనే. గత కొన్నేళ్లలో ఆమె తమిళంలో విజయ్, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రంలోనూ నటించింది. ఐతే ఈ మధ్య ఆమె సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్నట్లుగా కనిపించింది.

త్రిషకు రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం ఉన్నట్లుగా వార్తలు రావడంతో ఆమె మొత్తంగా సినిమాలకు టాటా చెప్పేస్తుందా అన్న చర్చ నడిచింది. ఐతే ఇప్పటికప్పుడు ఆమె రిటైరయ్యేలా కనిపించడం లేదు. తాజాగా త్రిష ఒక మెగా మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం.

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో రాబోతున్న మెగా మల్టీస్టారర్‌లో త్రిష కథానాయికగా నటించనుందట. మరి ఈ ఇద్దరు లెజెండరీ హీరోల్లో ఎవరికి త్రిష జోడీగా నటిస్తుందో తెలియదు. గతంలో సూపర్ స్టార్‌తో ‘పేట’ చిత్రంలో జంటగా నటించింది త్రిష. కమల్‌తో మన్మథబాణం, చీకటి రాజ్యం, థగ్ లైఫ్ చిత్రాలు చేసింది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్తుందని భావిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో నటించేందుకు త్రిష ఏకంగా రూ.12 కోట్ల పారితోషకం తీసుకోనుందట. ఇదే నిజమైతే ఆమెకు కెరీర్లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది.

ఈ వయసులోనూ బడా బడా సినిమాలు చేజిక్కించుకుంటూ, ఈ స్థాయిలో పారితోషకం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కెరీర్లో లేటు వయసులో ఇలాంటి డిమాండ్ ఉన్న అరుదైన కథానాయికల్లో త్రిష ఒకరు.