సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్న డ్రామాలో పావుగా మారిన విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. గెలుస్తానో లేదో తెలియక ముందే ఇదే తన చివరి మూవీగా ప్రకటించుకున్న విజయ్ ఇక మేకప్ ఎప్పటికీ వేసుకోకపోవచ్చు. పూర్తిగా ప్రజా జీవితానికి అంకితం కాబోతున్నారు.

ఇక ఇప్పుడు విజయ్ అభిమానులు జన నాయకుడుకి థియేటర్లలో ఓ రేంజ్ లో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంజీఆర్, జయలలితలు సిఎం అయ్యాక వాళ్ళు నటించిన కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ అనుకోకుండా విజయ్ కు ఆ అదృష్టం దక్కింది. ఇప్పుడు టీవీకె పార్టీ వర్గాలు, ఇతర పార్టీల్లో ఉన్న విజయ్ ఫ్యాన్స్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఆ రోజు తమిళనాడు మొత్తం థియేటర్లలో ఈ ఒక్క సినిమానే ప్రదర్శించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇప్పటికి ట్రేడ్ వర్గాల్లో ఉన్న డిస్కషన్ ప్రకారం మే 27 విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. కేవలం పెద్ది రావడానికి వారం ముందు అంటే కొంచెం రిస్క్ అయినప్పటికీ జన నాయకుడు వరకు తమిళనాడులోనే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇతర బాషల మీద భారీ ఆశలు పెట్టుకోవడానికి లేదు. భగవంత్ కేసరి రీమేక్ కావడంతో ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున స్వాగతం దక్కుతుందని అనుకోవడానికి లేదు. మన రెగ్యులర్ ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.

ఇదంతా ఓకే కానీ జన నాయకుడు దృష్టి సారించాల్సిన మరో ముఖ్యమైన సమస్య ఉంది. రిలీజ్ కు ముందే హెచ్డి ప్రింట్ వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సాధ్యమైనంత మేర అరికట్టింది కానీ రేపు థియేటర్లకు వచ్చాక దాన్ని మళ్ళీ బయటికి తీస్తారు. అప్పుడు కట్టడి చేయడం చాలా కష్టం. అయినా సరే ఓపెనింగ్స్, కలెక్షన్స్, రికార్డుల విషయంలో జన నాయగన్ కోలీవుడ్ లో కొత్త సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.