కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు మే బోణీ కూడా నిరాశనే మిగిల్చింది. ఎంతో హడావిడితో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమ గురించే కనిపించేలా గాయపడ్డ సింహం, జెట్లీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు మంచి కలెక్షన్లు వస్తాయని బయ్యర్లు ఎదురు చూశారు. కానీ రెండూ ఇంచుమించు ఒకే రిజల్ట్ అందుకోవడం అసలు ట్రాజెడీ.
ముందుగా గాయపడ్డ సింహం సంగతి చూస్తే వీకెండ్ లోనూ అనూహ్యమైన పికప్ చూపించలేకపోయింది. హీరో తరుణ్ భాస్కర్ ని పక్కన పెట్టేసి శ్రీవిష్ణుని హైలైట్ చేస్తున్నా జనాలు పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు. కారణం పబ్లిక్ టాక్, రివ్యూలు అంతంత మాత్రంగా ఉండటమే. ఇక జెట్లీ మూవీ కమెడియన్ సత్య పుణ్యమాని ఓ మోస్తరుగా ఏ సెంటర్స్ లో లాగింది కానీ ఇది కూడా గాయాలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కలెక్షన్ల రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.
సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు మరింత కిందకు వెళ్లిపోయాయి. కంటెంట్ లో క్వాలిటీ ఉంటే తప్ప టికెట్లు కొనమని మొండికేసిన ఆడియన్స్ ని మెప్పించడం దర్శకులకో సవాల్ గా మారుతోంది. సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ తెలుగులో ఒక రోజుగా వచ్చింది కానీ ఒక ఆటకే జనాలు దండం పెట్టేశారు. బాలీవుడ్ కం మరాఠి సినిమా రాజా శివాజీ అనువాదం చేయకపోవడంతో నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో తప్ప ఈ బొమ్మ పడిన దాఖలాలు లేవు.
ధనుష్ కర సైతం మెప్పించలేక తేలిపోయింది. ఇదంతా ఒక వైపు అయితే ఎండలు, ఐపీఎల్, తమిళనాడు రాజకీయాల గురించి తెలుగు యువత చేస్తున్న ఆన్ లైన్ చర్చలు థియేటర్ల మీద ఎంతో కొంత ప్రభావమైతే చూపిస్తన్నాయి. ఒకవేళ యునానిమస్ అనిపించుకునే సినిమా ఏదైనా వచ్చి ఉంటే డిస్కషన్ మొత్తం దాని గురించే ఉండేది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఈ శుక్రవారం రిలీజులు గోదారి గట్టుపైన, సతి లీలావతి ఏమైనా ఆదుకుంటాయేమో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates