భర్తతో సారీ చెప్పించిన రకుల్

సెలబ్రిటీలు సినీ వేడుకల్లో.. ఇంటర్వ్యూల్లో ఫ్లోలో ఏదో ఒకటి మాట్లాడేయడం.. ఆ మాటలు తీవ్ర వివాదానికి దారితీయడం.. తర్వాత వాళ్ళు తప్పయిపోయింది అని క్షమాపణలు చెప్పడం.. లేదంటే తమ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని వివరణ ఇవ్వడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఈ జాబితాలోకి తాజాగా బాలీవుడ్ భార్యాభర్తలు రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని కూడా చేరారు.

ఇటీవల ఈ జంట ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తమది రిలేషన్షిప్ కాదు సిట్యుయేషన్షిప్ అంటూ భిన్నమైన పదం వాడాడు జాకీ. అంతే కాక.. తాను, ర‌కుల్ పెళ్ల‌యిన త‌ర్వాత కూడా ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు ఉంటున్నామ‌ని జాకీ చెప్పుకొచ్చాడు. తాము ఒక‌రికి ఒక‌రం ఎక్స్‌క్లూజివ్ అని.. అలా అని వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వాళ్లు బ‌తికే, కెరీర్ల‌లో ముందుకు సాగే స్వేచ్ఛ ప‌ర‌స్ప‌రం తాము ఇచ్చుకుంటామ‌ని అత‌ను చెప్పాడు.

తాను ర‌కుల్ ముందే త‌న మాజీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి స్పీక‌ర్ పెట్టి మ‌రీ మాట్లాడ‌తాన‌ని కూడా అతను చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. మీడియాలోనూ దీనిపై విమర్శలు తప్పలేదు. ఐతే ఈ విమర్శల గురించి తర్వాత రకుల్ స్పందిస్తూ జాకీ మాటల్ని ముక్కలు ముక్కలుగా చేసి వివాదం చెయ్యొద్దని అంది.

మీడియా కథనాలు చూసి తామిద్దరం నవ్వుకున్నాం అని కూడా చెప్పింది. దీంతో మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ తప్పలేదు. భర్తకు బుద్ధి చెప్పకుండా ఈ వ్యంగ్యాస్త్రాలు ఏంటి అంటూ ఆమెను విమర్శించారు. ఈ నేపథ్యంలో రకుల్ ఈసారి భర్తతో కలిసి ఒక వీడియో చేసింది. అందులో జాకీ చెవులు పట్టుకుని తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు.

“మనం మిలీనియల్స్, జెన్ జీ లాగా ప్రవర్తించవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి” అంటూ భర్తకు రకుల్ క్లాస్ కూడా పీకింది. తన మాటల్లో వేరే ఉద్దేశం లేదని జాకీ చెప్పగా.. ఆ విషయం తనకు తెలుసని, ప్రపంచానికి కూడా తెలియాలనే ఇలా వీడియో చెయ్యాల్సి వస్తోందని రకుల్ నవ్వుతూ చెప్పింది. జాకీ సారీ చెప్పిన నేపథ్యంలో ఇంతటితో ఈ వివాదానికి తెర పడుతుందేమో చూడాలి.