పూరి, విజ‌య్‌.. ఏంటి స‌మ‌స్య‌?


క‌రోనా వ‌ల్ల ఆగిన షూటింగ్స్ పునఃప్రారంభానికి ప్ర‌భుత్వాలు నాలుగు నెలల కింద‌టే అనుమ‌తులు ఇచ్చాయి. కానీ క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా వెంట‌నే షూటింగ్స్ మొద‌లుపెట్ట‌డానికి జంకారు. ధైర్యం చేసి మొద‌లుపెట్టినా.. త‌ర్వాత క‌రోనా కేసులు వెలుగు చూడ‌టంతో వెన‌క్కి త‌గ్గారు. కానీ గ‌త రెండు నెల‌ల్లో మాత్రం ప‌రిస్థితి మారిపోయింది.

ఇంత‌కుముందు త‌ట‌ప‌టాయించిన వాళ్లంద‌రూ కూడా షూటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాదాపు అన్ని చిత్రాలూ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. పెద్ద స్టార్ల‌లో ఒక్క మ‌హేష్ బాబు మాత్ర‌మే త‌న కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టాల్సి ఉంది. ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాక ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

ఐతే టాలీవుడ్లో క‌రోనా కంటే ముందు షూటింగ్ ద‌శ‌లో ఉన్న వాటిలో పునఃప్రారంభం కాని సినిమా అంటే.. ఒక్క ఫైట‌ర్ మాత్ర‌మే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో మొద‌లైన ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందు చ‌క‌చ‌కా షూటింగ్ జ‌రుపుకుంది. క‌రోనా వ‌ల్ల విరామం వ‌చ్చాక ఎంత‌కీ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పునఃప్రారంభం కాలేదు. క‌రోనాకు భ‌య‌ప‌డ్డానికి విజ‌య్ ఏమీ పెద్ద వ‌య‌స్కుడు కాదు. పూరి కూడా త‌ట‌ప‌టాయించే ర‌కం కాదు. సినిమా తీయ‌డంలో పూరి స్పీడు గురించి కూడా తెలిసిందే. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా.. చ‌క‌చ‌కా షూటింగ్ అవ‌గొట్టేస్తుంటాడు. మ‌రి ఫైట‌ర్ సినిమాను పునఃప్రారంభించ‌డానికి అడ్డొస్తున్న‌దేంటో అర్థం కావ‌డం లేదు.

ముంబ‌యిలో తీయాల్సిన స‌న్నివేశాల‌కు అనుమ‌తులు రాలేద‌న్నారు. దీంతో మ‌రోచోట ఆ స‌న్నివేశాలు ప్లాన్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ఎంత‌కీ ఈ సినిమా మాత్రం షూటింగ్‌కు వెళ్ల‌ట్లేదు. విజ‌య్ వ‌ర్క‌వుట్లు చేసుకుంటూ, ఏవేవో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఖాళీగా క‌నిపిస్తున్నాడు. ఓవైపు శివ నిర్వాణ ట‌క్ జ‌గ‌దీష్‌ను పూర్తి చేసి విజ‌య్ సినిమా మొద‌లుపెట్టే సన్నాహాల్లో ఉంటూ విజ‌య్ పూరి సినిమా విష‌యంలో హ‌డావుడి ప‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.