తండెల్ దర్శకుడి సినిమాకు పెద్ద బ్రేక్?

చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత ‘సవ్యసాచి’తో నిరాశపరిచినా.. ఆపై కార్తికేయ-2, తండేల్ చిత్రాలతో విజయాలందుకున్నాడు.

చందూతో ఈసారి ఒక భారీ యానిమేషన్ సినిమా చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగవంశీ రెడీ అయ్యాడు. గత ఏడాది యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో అదే తరహాలో ఆంజనేయుడి కథతో ‘వాయుపుత్ర’ తీయాలని వీళ్లిద్దరూ సంకల్పించారు. 

దాదాపు ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు చందూ మొండేటి. ఈ ప్రాజెక్టు గురించి నాగవంశీ మీడియా ముందు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. త్వరలో అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వస్తుందని కూడా గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ యానిమేషన్ మూవీని చందూ విజన్‌కు తగ్గట్లు తీయాలంటే బడ్జెట్ కొంచెం ఎక్కువే అవుతుందని.. కానీ బిజినెస్ పరంగా ఆ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం కష్టమని భావిస్తున్నారట. ఇటీవల డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తినేయడం వల్ల అనుకున్న రేట్లు రావట్లేదు. 

నాగవంశీ సినిమాలను రెగ్యులర్‌గా కొనే ఓటీటీ సంస్థ.. ‘వాయుపుత్ర’కు ఆఫర్ చేసిన రేటు ప్రకారం ఈ సినిమా బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను క్యాన్సిల్ చేయడం కాదు కానీ.. హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

మార్కెట్ సరిగా లేని నేపథ్యంలో ప్రస్తుతానికి ఆపి, పరిస్థితులు మారాక దీన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. ఈలోపు వంశీ, చందూ వేరే సినిమా కోసం చేతులు కలిపే అవకాశముంది. ఎవరైనా స్టార్ హీరోతో రెగ్యులర్ సినిమానే తీయాలని చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి క్లారిటీ రావచ్చు.