హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ నైట్ పార్టీపై ఈగిల్ పోలీసుల బృందం దాడి చేసింది. దాడి అనంతరం అక్కడ డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో పలువురికి డ్రగ్ టెస్టులు నిర్వహించింది. అందులో 8 మంది వ్యక్తులు డ్రగ్స్ వాడినట్లు తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ టెస్టుల్లో తనకు నెగెటివ్ వచ్చిందటూ సినీ నటి హేమ పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. ఓ పబ్ నిర్వహించిన ఈ పార్టీకి వెళ్లిన తాను డ్రగ్సేమీ తీసుకోలేదని చెబుతూ హేమ ఆనందపడిపోయిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
డీజే బ్లాక్ కాఫీ పేరిట అంతర్జాతీయ స్థాయి సింగర్ ఒకరు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల తన పర్యటనలో ఆయన హైదరాబాద్ లో తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని క్వేక్ ఎరెనా పబ్ వేదికగా జరిగిన ఈ పార్టీకి దాదాపుగా 1,500 మంది హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈగిల్ టీం పబ్ పై దాడి చేసింది.
పార్టీకి హాజరైన వారిలో డ్రగ్స్ సేవించారన్న అనుమానం ఉన్న వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకున్న ఈగిట్ బృందం వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించింది. ఇలా పోలీసులు టెస్టులు నిర్వహించిన వారిలో నటి హేమ కూడా ఉండటం గమనార్హం.
ఈగిల్ టీం టెస్టుల్లో 8 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు… వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత హేమ సోషల్ మీడియా వేదికగా తన వీడియోతో కూడిన ఓ పోస్టును పెట్టారు.
ఈగిల్ టీం తనకూ డ్రగ్ టెస్టు నిర్వహించిందని, అయితే ఆ టెస్టులో తనకు నెగెటివ్ అని వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తాను తప్పు చేయనని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్న రీతిలో హేమ ఫోజులు పెట్టింది. ఇదిలా ఉంటే డీజే బ్లాక్ కాఫీ సింగర్ కు డ్రగ్ టెస్టు చేస్తే… ఆయనకూ నెగెటివ్ అనే రిపోర్టు వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
