ఐశ్వర్య… వెంకీ త‌ర్వాత నాగార్జున‌తో?

త‌న వందో సినిమాను చ‌డీ చ‌ప్పుడు లేకుండా మొద‌లుపెట్టి.. చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తున్నాడు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా ముందు ఏవేవో పేర్లు వినిపించ‌గా.. చివ‌రికి త‌మిళ యంగ్ డైరెక్ట‌ర్ రా.కార్తీక్‌ను ఎంచుకుని, సొంత బేన‌ర్లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు నాగ్. ఇది అభిమానుల‌కు విందు భోజనం లాంటి సినిమా అని.. ఇందులో యాక్ష‌న్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉంటాయ‌ని నాగ్ గ‌తంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో నాగ్ భిన్న అవ‌తారాల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న ఏకంగా ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌బోతున్నార‌ట‌. అందులో ఒక‌రు సీనియ‌ర్ హీరో ట‌బు అని ఇంత‌కుముందే వార్త‌లు వ‌చ్చాయి. నిన్నే పెళ్ళాడ‌తా, ఆవిడా మా ఆవిడే లాంటి చిత్రాల‌తో ఎవ‌ర్ గ్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ్, ట‌బు ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి తెర‌పై క‌నిపించబోతుండ‌డం నిన్న‌టి త‌రం ప్రేక్ష‌కుల‌కు నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇక ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా ఐశ్వ‌ర్యా రాజేష్ ఖ‌రారైంద‌న్న‌ది తాజా స‌మాచారం. ఈ తెలుగ‌మ్మాయి త‌మిళంలో స్టార్ హీరోయిన్ అయ్యాక తెలుగులో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. గ‌త ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాంలో వెంకీకి జోడీగా న‌టించింది ఐశ్వ‌ర్య‌. ఆ సినిమా బ్లాక్ బ‌స్టర్ అయిన‌ప్ప‌టికీ.. ఐశ్వ‌ర్య‌కు తెలుగులో ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాలేదు.

ఇప్పుడు వెంకీ త‌రం సీనియ‌ర్ హీరో అయిన నాగ్ స‌ర‌స‌న ఆమెకు ఛాన్స్ ద‌క్కింది. ఈ చిత్రంతో సుస్మితా భ‌ట్ అనే మ‌రో హీరోయిన్ కూడా న‌టిస్తోంది. ఈ త‌మిళ అమ్మాయి.. గ‌తంలో తెలుగులో నాట్యం అనే క్లాసికల్ డ్యాన్స్ నేప‌థ్యంలో సాగే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఈ వ‌య‌సులోనూ నాగ్ ముగ్గురు హీరోయిన్ల‌తో జ‌ట్టు క‌డుతుండ‌డం విశేష‌మే.

ఈ వేస‌విక‌ల్లా నాగ్ వందో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగ‌స్టు 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట టీమ్. ఇప్ప‌టిదాకా ఈ సినిమా గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఏ విశేషాన్నీ పంచుకోలేదు నాగ్ బృందం.