సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్టులో హీరోయిన్గా నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సల్మాన్ ఖాన్ లాగే నయనతార కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాఫిట్ షేరింగ్ మోడల్ను ఎంచుకున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు మాత్రమే తీసుకునే ఈ తరహా డీల్ను ఒక హీరోయిన్ ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
నయనతార గతంలో ‘జవాన్’ సినిమా కోసం సుమారు 10 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తన క్రేజ్ను బట్టి రెమ్యూనరేషన్ మరింత పెంచినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా కొన్ని ఆఫర్లు వచ్చినా, ఆమె అడిగే నంబర్లకు భయపడి నిర్మాతలు వెనకడుగు వేశారు.
కానీ ఈ బాలీవుడ్ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి ఆమెనే కావాలని పట్టుబట్టడంతో, దిల్ రాజు ఈ దారి వెతికారని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ రూపంలో పెద్ద మొత్తం ఇచ్చి రిస్క్ తీసుకోకుండా, సినిమా బిజినెస్ లేదా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా కోసం కేవలం కొంత మొత్తాన్ని తీసుకుని, మిగతాది లాభాల్లో షేర్ రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపారని తెలుస్తోంది. ఒక టాప్ హీరోతో సమానంగా హీరోయిన్ కూడా బిజినెస్ డీల్ కుదుర్చుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.
ఒక ఫిక్స్డ్ అమౌంట్తో సరిపెట్టుకోకుండా, సినిమా రిజల్ట్ను బట్టి తన ఆదాయం ఉండేలా నయన్ ప్లాన్ చేయడం గమనార్హం. ఈ సినిమాను 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒక క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో నయనతార పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అందుకే దిల్ రాజు కూడా రెండు వైపులా ఇబ్బంది లేకుండా ఈ ప్రాఫిట్ షేర్ పద్ధతిని అమలు చేసినట్లు సినీ వర్గాల్లో ఒక గాసిప్ నడుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates