రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా జరగకపోయినా ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు పడే అగచాట్లు అన్ని ఇన్ని కావు. కానీ అందరు అలాగే ఉండరు. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు ఏదైనా సమస్య అనిపిస్తే ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టకుండా పారితోషికం వాయిదా వేసి, ఒకవేళ ఫ్లాప్ అయితే తర్వాత మిగిలింది అడిగేవారు కాదట.
ఇప్పటి జనరేషన్ లో పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో తన త్యాగ నిరతిని చూపిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు నామినల్ గా కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకుని తిరిగి మూవీ పూర్తయ్యేదాకా కూడా ఒక్క రూపాయి అదనంగా తీసుకోలేదట, మధ్యలో ఎప్పుడూ అడగలేదట. ప్రాజెక్టులో జరిగిన ఆలస్యాన్ని గుర్తించి వేగంగా పూర్తి చేయడానికి సహకరించి నలభై అయిదు రోజుల కాల్ షీట్ లోనే అయిపోయేలా దర్శకుడు హరీష్ శంకర్ కు సహకారం అందించారు.
ఇదంతా ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత మైత్రి నవీన్ స్వయంగా ప్రెస్ మీట్ లో పంచుకున్నారు. గతంలో హరిహర వీరమల్లు టైంలో నిర్మాత ఏఎం రత్నం సైతం పవన్ కళ్యాణ్ గురించి ఇదే తరహాలో ఉదహరించిన సంఘటన మర్చిపోకూడదు. హిట్ అయ్యాక బ్యాలన్స్ తీసుకుంటానని, ముందు రిలీజ్ పనులు చూడమని చెప్పడం గురించి రత్నం ఎమోషనలయ్యారు. అది విజయం సాధించకపోవడం వేరే సంగతి. పవన్ అటుపై ఇంకేమి అడిగి ఉండరు.
ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ని మెచ్చుకోవలసిందే. నిర్మాతల క్షేమం కోరే హీరోలు ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అదృష్టవశాత్తు టాలీవుడ్ లో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడే కాదు జానీ టైంలో నష్టాలకు బాధ్యత వహించి బయ్యర్లకు ఎంతో కొంత వచ్చేలా చేయడం గురించి అప్పటి మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదంతా ఎలా ఉన్నా రేపు ఉస్తాద్ భగత్ సింగ్ కనక అంచనాలకు తగ్గట్టు ఉంటే మటుకు కమర్షియల్ రికార్డులు చెల్లాచెదురు కావడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
