ఊ కొడతారా… బాకీ తీరుస్తారా

నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలు చేయడం చాలా అరుదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ క్యామియోలు చేశారు కానీ బాలయ్య మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ మంచు ఫ్యామిలీకి ఒక్కటే మినహాయింపు ఇచ్చారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో మహారాజు పాత్ర, అందులోనూ దెయ్యం టచ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ద్వారా అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు.

అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ మనోజ్, అదే మూవీలో నటించిన మంచు లక్ష్మికి ఆ బాండింగ్ అలా స్పెషల్ గా ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే అది తీర్చుకునే టైం వచ్చింది. దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ వారంలోనే షూటింగ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ కు సరిపడా ఒక పాత్రను ఇటీవలే నెరేట్ చేసినట్టు సమాచారం.

భైరవం, మిరాయ్ లో విలన్ గా ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ త్వరలో డేవిడ్ రెడ్డితో హీరోగా పునః ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. నిజంగా బాలయ్య మూవీ కోసం అడిగితే సంతోషంగా ఒప్పుకుంటాడు కాబట్టి నిజమైనా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా పధ్నాలుగు సంవత్సరాల బాకీ ఇప్పుడు పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే సంవత్సరం దసరా లేదా దీపావళికి విడుదల చేసే టార్గెట్ తో గోపీచంద్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.

వీరసింహారెడ్డి కాంబో  కావడంతో అంచనాలు అధికంగా ఉంటాయి. ముందు అనుకున్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ పక్కన పెట్టి కొత్త సబ్జెక్టు ఎంచుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా నయనతార దాదాపు ఫిక్స్. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ తర్వాత హ్యాట్రిక్ కలయికని రిపీట్ చేయబోతున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు తదితర వివరాలన్నీ లాంచ్ రోజే తెలియబోతున్నాయి. అఖండ తాండవం 2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ దీని మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు.