ప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దు

చిన్న సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి మంచి టాక్ వస్తే.. తొలి రోజు ఓపెనింగ్స్‌కు బాగా ప్లస్ అవుతోంది. సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి కూడా ఈ షోలు ఉపయోగపడతాయని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఐతే గత ఏడాది కోర్టు, రాజు వెడ్స్ రాంబాయి, ఈ మధ్య కపుల్ ఫ్రెండ్లీ లాంటి సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్ కలిసొచ్చిన మాట వాస్తవమే.

సినిమా బాగుంటే ఓకే కానీ.. లేదంటే ఈ షోలు నెగెటివ్ ఎఫెక్ట్ కూడా చూపిస్తున్నాయి. మరోవైపు ఈ షోలు పడగానే పెయిడ్ ట్వీట్లు వరదలా వచ్చి పడిపోతుండడం వల్ల రియల్ టాక్ ఏంటో కూడా తెలియని పరిస్థితి తలెత్తుతోంది. గత వారం రిలీజైన ‘హే బల్‌వంత్’ సినిమా గురించి ఆహా ఓహో అంటూ పొగిడేశారు. పెయిడ్ ట్వీట్లతో హోరెత్తించేశారు. తీరా చూస్తే సినిమాలో అంత విషయం లేదని మార్నింగ్ షోలతో తేలిపోయింది. తొలి రోజు సాయంత్రానికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి.

ఈ నేపథ్యంలో పెయిడ్ ప్రిమియర్స్ వల్ల లాభమా, నష్టమా అనే చర్చ జరుగుతోంది. ఈ శుక్రవారం రిలీజవుతున్న ‘విష్ణు విన్యాసం’ మీద మేకర్స్ ధీమాగానే ఉన్నప్పటికీ.. పెయిడ్ ప్రిమియర్స్ జోలికి వెళ్లలేదు. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో విలేకరులు దీని గురించి అడిగితే.. టీం ఇప్పటి వరకైతే తమకు ఆ ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది.

ముందు రోజు పరిస్థితి చూసి ఏమైనా ప్లాన్ చేస్తే చేస్తామంది. కానీ ఈ రోజు ఎక్కడా పెయిడ్ ప్రిమియర్స్ అయితే లేవు. ఈ పెయిడ్ ప్రిమియర్స్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని భావిస్తుండడం.. ప్రేక్షకులను గందరగోళానికి గురి చేయడం కూడా ఇష్టం లేక పెయిడ్ ప్రిమియర్స్ మీద శ్రీ విష్ణు అండ్ కో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

‘సామజవరగమన’ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం వల్ల శ్రీ విష్ణు లాభం పొందినప్పటికీ.. ‘సింగిల్’కు అలా చేయలేదు. ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’ విషయంలోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నాడు. వచ్చే వారం ‘మృత్యుంజయ్’ సినిమాకు కూడా పెయిడ్ ప్రిమియర్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.