దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన ఇండియన్ ఎడిషన్ అవార్డుల ఫంక్షన్ నిర్వహించింది. దానికి బాలీవుడ్ నుంచి బడా సెలబ్రిటీలు హాజరయ్యారు. సదరు బ్రాండ్ పవర్ అలాంటిది. కానీ దురంధర్ బృందం నుంచి ఒక్కరు రాలేదు.

పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి, ఎనభై రోజులకు దగ్గరవుతున్నా, ఇంకా థియేటర్లలో ఆడుతున్న అరుదైన మూవీగా, యాంకర్ గొప్పగా ప్రశంసిస్తూ అవార్డును తీసుకోవాల్సిందిగా కోరుతూ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. తీరా చూస్తే అక్కడ ఎవరు లేరు. హీరో నుంచి దర్శకుడి దాకా అందరూ ఆబ్సెంట్.

ఎందుకయ్యా అంటే దురంధర్ మీద నెగటివ్ రివ్యూ ఇచ్చి దీన్నో యాంటీ పాకిస్థాన్ కంటెంట్ గా వర్ణించిన రివ్యూయర్ సదరు మ్యాగజైన్ ఎడిటర్ కాబట్టి. రిలీజ్ టైంలో ఆవిడ సమీక్ష మీద తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోని యూట్యూబ్ నుంచి తొలగించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

అనలిస్ట్ గా చాలా పేరున్న ఆమెకు అదో బ్లాక్ స్పాట్ లా మిగిలిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు వాళ్లే స్వయంగా అవార్డు ఇస్తామని చెప్పినా దురంధర్ టీం రాకుండా ఝలక్ ఇచ్చింది. సినిమా బాలేదని చెప్పడం తప్పు కాదు. అది వ్యక్తిగత అభిప్రాయం. కానీ శత్రుదేశానికి మద్దతనిపించేలా కామెంట్స్ చేయడం చాలా మందికి నచ్చలేదు.

ఇప్పుడీ వీడియో ఎక్స్ లో బాగా వైరల్ అవుతోంది. దీని సంగతి అలా ఉంచితే దురంధర్ టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది. మార్చి 19 విడుదల తేదీ ఎంతో దూరంలో లేకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పరుగులు పెట్టిస్తూ ప్రమోషన్లను ప్లాన్ చేసుకొంటోంది. ముఖ్యంగా పోటీలో ఉన్న టాక్సిక్ ఎంతో అడ్వాన్స్ గా స్క్రీన్లను బ్లాక్ చేసుకునే పనిలో ఉండటంతో దురంధర్ 2 సైతం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ ఏడాది అతి పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్న రెండు సినిమాలు ఇలా పరస్పరం తలపడటం గురించి ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వెనక్కు తగ్గే అవకాశాలు నూటికి నూరు శాతం లేవు.