బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన జోరు తగ్గింది. కొన్ని ఫెయిల్యూర్లకు తోడు.. బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయి సినిమాలు తగ్గించేశారు. ఎక్కువగా స్ట్రీమింగ్ సంస్థలకు వెబ్ ఫిలిమ్స్, సిరీస్లు చేస్తున్నారు.
అలాగే నటుడిగా బిజీ అవుతున్నారు. ఐతే తనకు బాగా అసోసియేషన్ ఉన్న నెట్ఫ్లిక్స్ సంస్థ వల్ల తాను తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ వెల్లడించడం చర్చనీయాంశం అవుతోంది.
నెట్ఫ్లిక్స్ కోసం తాను చేయాల్సిన మాగ్జిమం సిటీ అనే ప్రాజెక్టు విషయంలో తీవ్ర ఇబ్బంది పడ్డట్లు అనురాగ్ వెల్లడించాడు. ఆ ప్రాజెక్టు కోసం తాను చాలా ఖర్చు పెట్టానని.. ఎప్పట్నుంచో ఆ ప్రాజెక్టు మీదే ధ్యాస పెట్టానని.. ఏడాదిన్నర పాటు కష్టపడి ఆ స్క్రిప్టు రాశానని.. ఐతే దాని కథేంటో కూడా తెలియకుండా నెట్ఫ్లిక్స్ ఓకే చెప్పిందని.. తాను ఎంతగా చెప్పినా టీంలో ఎవ్వరూ స్క్రిప్టు చదవలేదని అనురాగ్ చెప్పాడు.
తీరా చూస్తే ఆ సినిమా విషయంలో నెట్ఫ్లిక్స్ సైలెంట్ అయిపోయిందని అనురాగ్ చెప్పాడు. దాని బదులు వేరే స్క్రిప్టు ఇచ్చిన దాన్ని డైరెక్ట్ చేయమని నెట్ఫ్లిక్స్ కోరిందని.. కానీ ఆ స్క్రిప్ట్ సరిగా లేకపోవడంతో తాను టైం అడిగానని.. నెట్ఫ్లిక్స్ మాత్రం ఆర్టిస్టుల డేట్లు ఖాళీగా ఉన్నాయంటూ తన మీద ఒత్తిడి తెచ్చిందని అనురాగ్ తెలిపాడు.
తాను రాసిన ఒక షో నెట్ఫ్లిక్స్కు నచ్చి, దాన్ని మనీ హైస్ట్ ఇండియన్ వెర్షన్లా మార్చమని అడిగిందని.. వాళ్ల పద్ధతి అస్సలు నచ్చలేదని.. ఈ మొత్తం వ్యవహారంలో తాను చాలా ఒత్తిడి ఎదుర్కొని రెండుసార్లు గుండెపోటుకు గురయ్యానని అనురాగ్ వెల్లడించాడు.
దీంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడానని.. దీంతో పాటు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోవడంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని.. ఆస్తమా ఎటాక్ అయిందని, స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని అనురాగ్ చెప్పాడు.
తన ఆహారపు అలవాట్లు కూడా బాలేక 8 నెలల్లో 35 కిలోల బరువు పెరిగానని.. తనను చూసి భయపడ్డ కూతురు రిహాబిలిటేషన్ సెంటర్కు కూడా పంపిందని.. అదే సమయంలో తన కాలికి గాయమైతే.. వేరే మందులు వాడుతుండడంతో సర్జరీ కూడా చేయించుకోలేక కొన్ని నెలల పాటు వీల్ఛైర్కు పరిమితం అయ్యానని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని అనురాగ్ చెప్పుకొచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates