సినిమా ఏదైనా సంక్రాంతే టార్గెట్

టాలీవుడ్లో ముందు నుంచీ సంక్రాంతి అంటే యమ క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. చాలా ముందుగానే ఆ సీజన్ కోసం బెర్తులు బుక్ అవుతుంటాయి. ప్రతి సంవత్సరం కనీసం అరడజను సినిమాలైనా కర్చీఫ్ వేస్తుంటాయి. చివరికి మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతుంటాయి. ఐతే ఈసారి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పండక్కి రిలీజయ్యాయి.

గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ సంవత్సరం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి ఫ్యామిలీ మూవీస్ సాధించిన వసూళ్లు చూశాక ఈ సీజన్‌కు క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా వాటి స్థాయికి మించే వసూళ్లు రాబట్టాయి. వేరే సమయాల్లో అయితేే ఈ చిత్రాలు ఏవీ కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టేవి కావన్నది స్పష్టం. అందుకే సంక్రాంతి మీద మోజు టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌లో ఇంకా పెరిగిపోయింది.

గతంలో సంక్రాంతికి ఆరేడు నెలల ముందు సినిమాలు రేసులోకి వచ్చేవి. కానీ ఈసారి ఏడాది ముందే ఆ పండుగ లక్ష్యంగా కర్చీఫ్‌లు వేయడం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తారని.. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఆ పండక్కే వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అలాగే వెంకటేష్‌త్ అనిల్ రావిపూడి కొత్త చిత్రం కూడా సంక్రాంతి పండక్కే అంటున్నారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య చేయనున్న సినిమా టార్గెట్ కూడా సంక్రాంతే అనే వార్తలు వచ్చాయి. ఇంతలో నాగార్జున.. ‘వాసివాడి తస్సాదియ్యా’ పేరుతో సంక్రాంతి సినిమా చేస్తున్నాడు. 

మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. శర్వానంద్ తాను మళ్లీ సంక్రాంతికి వస్తానని ప్రకటించాడు. తాజాగా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ నితిన్ ఓ పండుగ సినిమా కోసం సన్నద్ధమవుతున్నట్లు కొత్త కబురు వినిపిస్తోంది. ఇంకో రెండు మూడు సినిమాలు కూడా పండుగ టార్గెట్‌తో రెడీ అవుతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

మొత్తంగా ప్రస్తుతానికి పది సినిమాల దాకా సంక్రాంతి టార్గెట్‌గా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇన్నాళ్లూ సంక్రాంతి అంటే ఉన్న మోజు కాస్తా.. ఇప్పుడు వేలం వెర్రిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు కర్చీఫ్‌లు అయితే వేస్తున్నారు కానీ.. వీటిలో చివరికి పోటీలో ఎన్ని మిగులుతాయో చూడాలి.