నంది అవార్డులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

నంది అవార్డులు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండేవో ముందు తరం వారికి బాగా తెలుసు. ఈ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావించేవారు సినీ జనాలు. సినిమాలతో పాటు టీవీ, నాటక రంగాలకు కూడా నందులు ఇచ్చి గౌరవించేవి అప్పటి ప్రభుత్వాలు.

కానీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో కథ మారిపోయింది. ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్‌లోనే అయినా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు. మరోవైపు ఏపీ సర్కారు కొంత కాలానికి ఒకేసారి కొన్నేళ్లకు కలిపి నంది అవార్డులు ప్రకటించినా.. ఇండస్ట్రీ అక్కడ లేకపోవడం, బాగా ఆలస్యం కావడం, అవార్డుల్లో పారదర్శకత కనిపించకపోవడం వల్ల వాటికి సరైన గుర్తింపు లభించలేదు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అవార్డులు కూడా అటకెక్కేశాయి. ఐతే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు మొదలుపెట్టి కొన్నేళ్లకు కలిపి పురస్కారాలు ప్రకటించింది.

కాగా ఇప్పుడు ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. కొన్ని నెలలుగా ఇందుకోసం కసరత్తు జరుగుతోంది. త్వరలోనే సినీ, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు ఇవ్వబోతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. నంది అవార్డులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.

2014, 2015, 2016 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని… ఆ తర్వాత మళ్లీ అవార్డులు ప్రకటించలేదని దుర్గేశ్ తెలిపారు. అప్పటి నిబంధనల ప్రకారమే ఇప్పుడు కూడా అవార్డులు ఇవ్వాలా? లేక మార్పులు ఏమైనా చేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

నంది అవార్డుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణల నుంచి ఈ అవార్డులపై సలహాలు తీసుకుంటామని తెలిపారు. రెండు, మూడు నెలల్లో అవార్డుల వేడుక ఉంటుందని వెల్లడించారు. నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామని దుర్గేష్ చెప్పారు. బహుశా ఉగాదికి నంది అవార్డులను అందజేయొచ్చని తెలుస్తోంది.