ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. 2021లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాక స్పీడు తగ్గించాడు. యాక్సిడెంట్ వల్ల ఏడాదికి పైగా విరామం తీసుకున్న అతను.. ఆ తర్వాత నటించింది రెండు చిత్రాల్లో మాత్రమే. అవే.. విరూపాక్ష, బ్రో. వీటిలో మొదటిది బ్లాక్బస్టర్, రెండోది యావరేజ్. ‘బ్రో’ తర్వాత గ్యాప్ తీసుకుని ‘సంబరాల యేటిగట్టు’ అనే భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు.
కేపీ రోహిత్ అనే కొత్త దర్శకుడితో ‘హనుమాన్’ నిర్మాతలు మొదలుపెట్టిన చిత్రమిది. భారీ బడ్జెట్తో రంగంలోకి దిగారు. కానీ ఆ బడ్జెట్ సినిమా మధ్యలోకి వచ్చేసరికే ఖర్చయిపోయిందని.. అదనంగా డబ్బులు పెడుతున్నారని వార్తలు వచ్చాయి. సినిమా బాగా ఆలస్యం కూడా అయింది. గత ఏడాది దసరాకే అనుకున్న ఈ చిత్రం.. ఈ ఏడాది వేసవిలో రావడం కూడా కష్టంగా ఉంది.
చాన్నాళ్లుగా ‘సంబరాల యేటి గట్టు’ గురించి ఏ అప్డేట్ లేదు. కానీ తేజు ఈ సినిమా సంగతేంటో తేల్చకుండానే.. కొత్త సినిమాలు అంగీకరిస్తూ ముందుకు వెళ్లిపోతున్నాడు. నటుడిగా కొన్ని చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి, ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్తో దర్శకుడిగా మారిన తేజ కాకుమానుతో ఓ సినిమా చేయబోతున్నాడు తేజు. ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఫాంలోకి వచ్చిన సీనియర్ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడట. ఇదొక లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
మరోవైపు తేజు.. ‘క’ సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘క’లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. ఈసారి ఇంకా పెద్ద స్థాయి కథతో రెడీ అవుతున్నారట దర్శకులు సుజీత్, సందీప్. కిరణ్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం, సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో తేజుతో వెళ్లనున్నారట మేకర్స్.
త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. తేజు ఇలా వరుసగా కొత్త సినిమాలు ఓకే చేయడం బాగుంది కానీ.. వీలైనంత త్వరగా ‘సంబరాల యేటిగట్టు’ సంగతి తేల్చి దాని రిలీజ్ ఖరారు చేస్తే బాగుంటుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
