ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని పంచే ఐమాక్స్ స్క్రీన్లు ఇండియాలో సరిపడా స్థాయిలో లేకపోవడం ఇక్కడి సినీ ప్రియులకు నిరాశ కలిగించే విషయం. ముఖ్యంగా సినిమాలంటే పడిచచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్కటీ ఐమాక్స్ స్క్రీన్ లేదు.
హైదరాబాద్లోని హకీంపేటలో భారీ ఐమాక్స్ కట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. నిర్మాణం అయితే ఇంకా మొదలు కాలేదు. రాజమౌళి, మహేష్ బాబుల కలయికలో రాబోతున్న ‘వారణాసి’ రిలీజయ్యే సమయానికి హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్ రావచ్చనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే హైదరాబాద్ అని పర్టికులర్గా చెప్పలేదు కానీ.. వారణాసి సినిమా రిలీజయ్యే సమయానికి 1:43 రేషియాలో బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటయ్యేలా తాను ధర్నా చేస్తానంటూ రాజమౌళి వ్యాఖ్యానించడం విశేషం.
‘వారణాసి’ ప్రమోషన్లను చాలా ముందుగానే మొదలుపెట్టిన రాజమౌళి టీం.. తాజాగా హాలీవుడ్ మీడియా సంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ‘వారణాసి’ని ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరించడం.. ఇండియాలో సరిపడా ఐమాక్స్ స్క్రీన్లు లేకపోవడం గురించి రాజమౌళి స్పందించాడు.
‘‘వారణాసిలో కేవలం ఒక ప్రపంచం ఉండదు. కొన్ని ప్రపంచాలు ఉంటాయి. ప్రతి ప్రపంచం పరిధి చాలా పెద్దది. ఈ ప్రపంచాలను అంత భారీగా క్రియేట్ చేయాలి అనుకున్నపుడు సాంకేతికంగా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే.. ముందు వచ్చిన ఆలోచన పెద్ద ఫార్మాట్లో చిత్రీకరించడం. ఆ ప్రపంచాల భారీతనాన్ని చూపించడానికి ఐమాక్సే సరైన మార్గం అనిపించింది.
ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలనుకున్నపుడు మాకు అక్కడ బిగ్ స్క్రీన్ అందుబాటులో లేదు. అప్పుడు మనమే ఒక భారీ తెరను నిర్మిద్దాం అని 100 అడుగుల భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశాం. సినిమా రిలీజయ్యే సమయానికి 1:43 రేషియో ఐమాక్స్ స్క్రీన్లు ఉండాలన్నది నా ఆలోచన.
మా దగ్గర ఏదైనా నచ్చనపుడు, సాధించుకోవాలనుకున్నపుడు టెంట్ వేసి ధర్నా చేసే సంప్రదాయం ఉంది. ఐమాక్స్ సంస్థ ముందు నేను 1:43 రేషియో ఐమాక్స్ స్క్రీన్ల కోసం ధర్నా చేయాలనుకుంటున్నా’’ అంటూ నవ్వేశాడు జక్కన్న. రాజమౌళి మాటల్ని బట్టి చూస్తే ‘వారణాసి’ రిలీజ్ టైంకి హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఐమాక్స్ స్క్రీన్లు ఏర్పాటు చేసేలా తన వంతు ప్రయత్నం గట్టిగానే చేసేలా కనిపిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates