మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు కెరీర్లో ‘నిజం’ అలాంటి సినిమానే. ‘జయం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు తేజ రూపొందించిన సినిమా ఇది.

ఈ చిత్రం ఒప్పుకునే సమయానికి ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ కాలేదు. అది వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాక ‘నిజం’ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కానీ ఆ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఒక్కడు’తో మహేష్‌కు అసామాన్యమైన ఇమేజ్ రావడం, అందులో ఫెరోషియస్ క్యారెక్టర్లో అతణ్ని చూశాక.. తల్లి చాటు కొడుకుగా ‘నిజం’ సినిమాలో అతణ్ని అంగీకరించలేకపోయారు అభిమానులు.

కానీ ‘నిజం’ బ్యాడ్ మూవీ అయితే కాదు. ‘ఒక్కడు’ తర్వాత రావడమే ఈ సినిమాకు సమస్యగా మారిందని ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అభిప్రాయపడ్డాడు.

‘నిజం’ సినిమాలో తన పాటలు కూడా సరిగా కుదరకపోవడం మైనస్ అయిందని ఆర్పీ చెప్పాడు. మహేష్‌కు తన వాయిస్ సెట్ కాలేదని అతను అంగీకరించాడు. మహేష్ తండ్రి కృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఆర్పీ వెల్లడించాడు. ‘‘నిజం సినిమా ‘ఒక్కడు’ కంటే ముందు రిలీజై ఉంటే కచ్చితంగా హిట్టయ్యేది. ‘ఒక్కడు’ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో మహేష్ బాబు ఇమేజ్ మారిపోయింది. భారీ అంచనాలతో ‘నిజం’ చూసి నిరాశ చెందారు.

తల్లి చాటు కొడుకుగా తనను యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఈ సినిమాలో నా పాటలు కూడా మైనస్ అయ్యాయి. ఆ పాటలకు నేను ఓకే. కానీ ఆ పాటలు మహేష్ బాబుకు కుదరలేదు. నా వాయిస్ తనకు సూటవ్వలేదు. రికార్డింగ్ టైంలో అందరూ ఓకే అన్నారు కానీ.. తర్వాత సందేహాలు కలిగాయి.

కృష్ణగారు కూడా పాటలు విని.. వేరే వాయిస్‌లు ఉంటే బాగుంటుందని అన్నారు. ఐతే నేను తెలుగును తెలుగులా పాడేవాళ్లతోనే పాటలు పాడిస్తా. శంకర్ మహదేవన్, కేకే పర భాషా గాయకులైనా తెలుగు పాటలు బాగా పాడతారు. వాళ్లు నాకు ఓకే. కానీ ఆ ఇద్దరూ ఆ టైంలో ఫారిన్లో ఉండడంతో ఇంకెవరితోనూ పాడించలేక నా పాటలను అలాగే ఉంచేశాను. నిజాయితీగా చెప్పాలంటే నా వాయిస్‌ మహేష్‌కు సెట్ కాలేదు’’ అని ఆర్పీ తెలిపాడు.