అమరన్ హీరోకి మిగలని ఆనందం

మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది. బయ్యర్లందరూ రెట్టింపు లాభాలతో గట్టెక్కారు. శివ కార్తికేయన్ కు దీంతోనే మంచి పునాది పడింది. మన ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.

ఎన్నో ఆశలు పెట్టుకుని మురుగదాస్ మదరాసీ చేస్తే దారుణంగా పోయింది. తమిళంలో కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ తెలుగులో వాషౌట్ అయ్యింది. ఇటీవలే తమిళంలో పొంగల్ పండక్కు సెన్సార్ అడ్డంకులు దాటుకుని పరాశక్తితో థియేటర్లలో అడుగు పెట్టాడు. కానీ అద్భుతాలు జరగలేదు.

జన నాయకుడు వాయిదా పడింది కాబట్టి పరాశక్తికి వసూళ్ల వర్షం కురుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ మొదలయ్యింది. అది కాస్తా నెగటివ్ గా మారిపోయింది. వసూళ్లు క్రమంగా తగ్గిపోవడం చూసి టీమ్ ఆందోళన చెందుతోంది.

ఇది అవకాశంగా తీసుకుని వేరే సినిమాలు హఠాత్తుగా రిలీజ్ డేట్లు ప్రకటించుకుని రేస్ లోకి వచ్చాయి. వాటిలో కార్తీ అన్నగారు వస్తారుతో పాటు జీవా కొత్త మూవీ ఉంది. ఇదంతా పరాశక్తికి ఇబ్బందిగా మారింది. శివాజీ గణేశన్ కల్ట్ టైటిల్ వాడుకుని పీరియాడిక్ డ్రామా చేస్తే ఇంత ప్రతికూల ఫలితం వస్తుందని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

ట్రాజెడీ ఏంటంటే హీరోగా మంచి ఇమేజ్ ఉన్నా దర్శకురాలు సుధా కొంగర మీద నమ్మకంతో రవి మోహన్ పరాశక్తిలో విలన్ గా నటించాడు. శ్రీలీల చాలా కాలం వెయిట్ చేసి కోలీవుడ్ డెబ్యూ కోసం దీన్ని ఎంచుకుంది. శివ కార్తికేయన్ ఫిజికల్ గా బాగా కష్టపడ్డాడు. ఇవన్నీ వృథా అయ్యాయి.

నిర్మాణం పెద్ద బడ్జెట్ తో జరిగింది. వేరే కాంబినేషన్ అనుకుని తర్వాత చేతులు మారిపోయి రెండేళ్లకు పైగా వెయిటింగ్ లో పరాశక్తికి చివరికి మిగిలింది ఫ్లాపేనని చెన్నై మీడియా కోడై కూస్తోంది. అయలన్ లాగా తెలుగు డబ్బింగ్ రాకుండా ఆగిపోతుందో లేక ధైర్యం చేసి ఇక్కడ రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.